29-07-2024 02:07:18 AM
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): కమర్షియల్ టాక్స్ విభాగంలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో భారీ అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. దాదాపు 75 కంపెనీలు అక్రమాలకు పాల్పడినట్టు ఫోరెన్సిక్ ఆడిట్లో గుర్తించారు. దీంతో కమర్షియల్ టాక్స్ కమిషనర్ రవి ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు రాష్ట్రప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తోపాటు కమర్షియల్ టాక్స్ అదనపు, డిఫ్యూటీ కమిషనర్లు విశ్వేశ్వర్రావు, శివరామప్రసాద్, ఐఐటీ హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్బాబుపై కేసులు నమోదుచేశారు.
అక్రమాలకు పాల్పడిన సంస్థల్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఫిలాంటో టెక్నాలజీస్ అనే సంస్థపై కూడా కేసు నమోదైంది. సోమేశ్కుమార్ సూచనలతోనే సాఫ్ట్వేర్లో మార్పులు చేసి భారీ కుంభకోణానికి పాల్పడినట్టు వెల్లడించారు. నిందితులపై ఐటీ యాక్ట్ సెక్షన్ 406, 409, 120బీ కింద కేసులు నమోదుచేశారు.