24-06-2025 04:48:57 PM
మంథని తాహసీల్దార్ కుమార్ స్వామికి వినతిపత్రంలో బిట్టుపల్లి రైతులు...
మంథని (విజయక్రాంతి): గత 35 ఏండ్లుగా ఖాస్తులోనే ఉన్నామని తమకు పట్టాలు ఇప్పించండి సార్ అని మంథని మండలం(Manthani Mandal) బిట్టుపల్లి గ్రామ రైతులు మంగళవారం మంథని తహసీల్దార్ గిరవేన కుమార్ స్వామి(Tahsildar Giravena Kumaraswamy)కి వినతిపత్రం అందజేశారు. గ్రామ శివారులోని సర్వే నంబర్ 47 లో గల భూములకు బిట్టుపల్లి, జిల్లెలపల్లి, సూర్యయ్యపల్లి, కాకర్లపల్లి, ఎక్లాస్పూర్ గ్రామాల రైతులు దాదాపు గత 35 సంవత్సరాల నుండి ఖాస్తు చేస్తున్నామని, ప్రభుత్వం ఇప్పటివరకు తమకు పట్టాలు ఇవ్వలేదని రైతులు అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన భూభారతి చట్టం ప్రకారం రెవెన్యూ సదస్సులో రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు తిరస్కరించినట్లు తెలిపారు.
ఇప్పటికే జిల్లా కలెక్టర్ ను కలిసి విషయం విన్నవించుకోగా సానుకూలంగా స్పందించారని, తమకు పట్టాలు లేక ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని రైతులు వాపోయారు. గత 15 ఏండ్ల నుండి ఇబ్బందులు పడుతున్నమని, ఇప్పటికైనా మీరు చొరవ తీసుకుని తమకు పట్టాలు ఇప్పించగలరని రైతులు తహసీల్దార్ ను కోరారు. ఈ కార్యక్రమంలో బీట్టుపల్లి మాజీ సర్పంచ్ పోగుల సదానందం, మంతెన సదయ్య, ఏట అర్జయ్య, ఆర్ల లింగయ్య, తోటపల్లి శంకర్, తోటపల్లి బాపు, కొయ్యాల దుర్గయ్య, జన్నె రవి, సంబంధిత గ్రామాల రైతులు పాల్గొన్నారు.