calender_icon.png 30 May, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతోన్మాదం తప్ప బీజేపీకి ప్రజా సమస్యలు పట్టవు..

29-05-2025 08:14:48 PM

సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి..

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం..

మునుగోడు (విజయక్రాంతి): భారతదేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషించడమే తప్ప దేశ ప్రజల సమస్యలు బీజేపీ ప్రభుత్వానికి పట్టవని సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి(CPI National Committee Member Palla Venkat Reddy) ఆరోపించారు. గురువారం సిపిఐ 15వ మహాసభను మండలంలోని సింగారం గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ మహాసభకు ఆయనతో పాటు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం(MLC Nellikanti Satyam) హాజరయ్యారు. ముందుగా అమరజీవి కామ్రేడ్ జినుకుంట్ల సాయిలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.

అనంతరం ఏర్పాటు చేసిన మహాసభలో పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... దేశంలో బీజేపీ ఎంఐఎం సహకారంతోనే మూడోసారి అధికారంలోకి వచ్చిందని, ఎంఐఎం పార్టీకి బీజేపీకి లోపాయికరంగా ఒప్పందాలు ఉన్నాయని అన్నారు. గత కొన్ని రోజులుగా నక్సలైట్ల స్థావరాలపై గురిపెట్టి విదేశీ శత్రువుల మీద దాడి మాదిరిగానే నక్సలైట్లను హతం చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపికి ప్రతిపక్షంలో ఉన్న వైయస్సార్సీపీకి ఈ రెండు బిజెపి సపోర్ట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా ఆంధ్రాలో కొత్త భనక చర్ల ప్రాజెక్టు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయడం దారుణం అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా ఆంధ్ర రాష్ట్రంలో నూతనంగా నిర్మించబోయే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలో ఉన్న బిజెపి సహకరించడం లేదని పేర్కొన్నారు. బిజెపిని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీతో లౌకికవాదంగా సిపిఐ పనిచేస్తుందని అన్నారు.

యురోనియం కోసమే నక్సల్స్ పై దాడి....

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

ఖమ్మం భద్రాచలం చత్తీస్గడ్ అడవులలో యురోనియా తవ్వకాల కోసం అడవిలో ఉన్న నక్సల్స్ ను ఏకతాటిగా బిజెపి ప్రభుత్వం హతం చేస్తున్నారని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. నక్సల్స్ ని హతమార్చకుండా ప్రజా సంఘాలతో బిజెపి ప్రభుత్వం చర్చలు జరపాలని అన్నారు. గత 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పొరేట్ సంస్థలను సపోర్ట్ చేస్తూ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతుందని అన్నారు. దేశంలో ఉన్న మౌలిక సమస్యలు నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేయకుండా సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా మత విద్వేషాల పరిపాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు.

రైతులకు వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు తీసుకువస్తే దేశవ్యాప్తంగా రైతాంగం కదిలి ఢిల్లీలో ఆరు నెలల పాటు ధర్నాలు రాస్తారోకాలు చేయడం వల్ల మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసిందని గుర్తు చేశారు. సిపిఐ 100 సంవత్సరాల కాలంలో నల్గొండ జిల్లాలో రావి నారాయణరెడ్డి సాకలి ఐలమ్మ ఇలా అనేకమంది అసమాన త్యాగాలు చేశారని అన్నారు.నల్లగొండ జిల్లా అనగానే ఎర్రజెండా కేంద్రంగా భారతదేశంలో నల్లగొండ జిల్లా ప్రసిద్ధి గాంచిందని అన్నారు.

నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గం కూడా అనేకమంది కమ్యూనిస్టు కార్యకర్తలు అసమాన త్యాగాలతో ముందుకు పోతున్నారని అన్నారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మారుతున్న పరిస్థితి ఎర్రజెండాను పట్టిన ప్రతి నిరుపేద కార్యకర్తలు పార్టీలు మారకుండా నిరుపేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండాను పట్టుకొని నీతి నిజాయితీగా పనిచేస్తున్నారని అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించాలని అన్నారు. 

మండల కార్యవర్గ సభ్యుడు ఉప్పునూతల రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ మండల మహాసభలో ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కురుమిద్ది శ్రీనివాసులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు  గురుజ రామచంద్రం, బులుగురి నరసింహ, తీర్పారి వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు  సురిగి చలపతి, బొమ్మర గోని లాలయ్య, సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, మాజీ జెడ్పిటిసి గోస్కొండ లింగయ్య,మండల సహాయ కార్యదర్శి మందుల పాండు, మండల కార్యవర్గ సభ్యులు బండమీది యాదయ్య, దుబ్బ వెంకన్న, ఈదులకంటి కైలాస్, వనం వెంకన్న, ఎండి జానీ, బులుగూరి వంశీకృష్ణ, బండారి శంకర్ ఉన్నారు.