6 April, 2026 | 5:08 PM

Breaking News

బీజేపీ 47వ స్థాపన దివస్ వేడుకలు తంగళ్ళపల్లిలో ఘనంగా నిర్వహణ

06-04-2026 03:24 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ 47వ స్థాపన దివస్ సందర్భంగా తంగళ్ళపల్లి పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ స్థాపకులు మరియు మహానేతలకు ఘన నివాళులు అర్పిస్తూ, పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ మరింత బలపడాలని ఆకాంక్షించారు. 1980 ఏప్రిల్ 6న స్థాపించబడిన బీజేపీ, సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా మారిందని ఆయన పేర్కొన్నారు.

ప్రారంభంలో కేవలం రెండు ఎంపీ స్థానాలతో ప్రారంభమైన ఈ పార్టీ, క్రమంగా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని తన స్థాయిని పెంచుకుంది. అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి బీజేపీ తన సత్తాను చాటిందని, అనంతరం నరేంద్ర మోదీ నాయకత్వంలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసి దేశ అభివృద్ధికి కొత్త దిశను చూపుతోందని తెలిపారు. “సబ్కా సాథ్ – సబ్కా వికాస్ – సబ్కా విశ్వాస్” అనే సిద్ధాంతంతో అన్ని వర్గాల అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకుని పార్టీ ముందుకు సాగుతోందన్నారు. చిన్న స్థాయి నుండి ప్రారంభమై ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిన బీజేపీ ప్రయాణం ప్రతి కార్యకర్తకు ప్రేరణగా నిలుస్తోందని తెలిపారు.