21-06-2025 10:31:27 PM
వివరాలు వెల్లడించిన డీఎస్పీ జీవన్ రెడ్డి..
అదిలాబాద్ (విజయక్రాంతి): ఫారెస్ట్ భూమిని తనదంటూ లేఔట్ చేసి ప్లాట్లుగా విక్రయించిన బీజేపీ నేత వకుళభరణం అదినాథ్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు మావల పోలీస్ స్టేషన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి(DSP Jeevan Reddy) వివరాలు వెల్లడించారు. వకుళభరణం అదినాథ్ అతని భార్య రజినిలు 2010 సంవత్సరంలో ఖానాపూర్ శివారులోని ఫారెస్ట్ భూమిని తన పేరుతో ఉందంటూ నమ్మించి ప్లాట్లు చేసి విక్రయించగా అందులో నాలుగు ప్లాట్లులను ఒక్కొక్కటి 3 లక్షల 30 వేలకు విక్రయించారన్నారు.
కాగా నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లు అమ్మారని తెలుసుకున్న బాధితులు పోలీసులనాశ్రయించారు. దీంతో బాధితురాలు శోభ మురార్ఖర్ ఈనెల 19న మావల పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై విచారణ చేపట్టగా ఫారెస్ట్ అధికారులు సైతం ఆ భూమి అటవీ భూమి అని ధృవీకరించారని తెలిపారు. కాగా వకుళభరణం ఆదినాథ్ ను అరెస్టు చేసి న్యాయమూర్తి హాజరుపర్చగా, 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ కు పంపడం జరిగిందని తెలిపారు. భార్య రజిని పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.