04-02-2026 12:06:17 AM
నేడు జిల్లా కేంద్రంలో బహిరంగ సభ
ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ డీకే అరుణ
మహబూబ్నగర్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ.. బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ తొలిసారిగా రాష్ట్రానికి రానున్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ గమైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి ఏర్పాట్లను ప్రత్యేకంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీ డీకే మాట్లాడుతూ.. నితిన్ నబీన్ మొదటిసారి రాష్ట్రానికి రావడం అందునా మహబూబ్నగర్ జిల్లాకు రావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయతీరాలకు చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. సభకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరుఅవుతారని తెలిపారు. నితిన్ నబీన్ శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం ఒంటిగంటకు జిల్లా కేంద్రానికి చేరుకుంటారని, వెంటనే సభ కార్యక్రమానికి చేరుకొని ప్రసంగిస్తారని వెల్లడించారు. వారివెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, తదితరులు ఉన్నారు.