calender_icon.png 21 June, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలు ఇంగ్లిష్ నేర్చుకోవడం బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌కు ఇష్టం లేదు

21-06-2025 01:49:18 AM

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలకు రాహుల్‌గాంధీ కౌంటర్

న్యూఢిల్లీ, జూన్ 20: మాజీ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రాసిన ‘మై బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్’ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఢిల్లీలో గురువారం కేంద్ర హోంమంత్రి విదేశీ భాషలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లిష్ మాట్లాడేవారు భవిష్యత్తులో సిగ్గుపడే రోజులు వస్తాయంటూ ఆయన పేర్కొ న్నారు.

ఈ వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పేద పిల్లలు ఇంగ్లిష్ నేర్చుకోవడం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు ఇష్టంలేదని విమర్శించారు. ‘ఇంగ్లిష్ ఆనకట్ట కాదు. ఇది ఒక వంతెన. ఇంగ్లిష్ సిగ్గుచేటు కాదు.. అది అధికారం. ఇంగ్లిష్ ఒక గొలుసు కాదు.. గొలుసులను విచ్ఛిన్నం చేసే సాధనం’ అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ‘బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు భారతదేశంలోని పేద పిల్లలు ఇంగ్లిష్ నేర్చుకోవాలని కోరుకోవడం లేదు.

ఎందుకంటే పేదలు ఈ భాష నేర్చుకుంటే.. వారికి ప్రశ్నించడం అలవడుతుంది. పేదలు ముం దుకు సాగడం, సమానంగా నిలవాలని వాళ్లు కోరుకోరు. నేటి ప్రపంచంలో మాతృభాష ఎంత ముఖ్యమో.. ఇంగ్లిష్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఇది ఉపాధిని అందిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. భారతదేశంలోని ప్రతి భాషకూ ఆత్మ, సంస్కృతి, జ్ఞానం ఉంటాయి. మనం వాటిని గౌరవించాలి. ప్రతిబిడ్డకు ఇంగ్లిష్ నేర్పించాలి. ఇది మీ పిల్లల్ని ప్రపంచంతో పోటీ పడేలా చేస్తుంది’ అని రాహుల్ పేర్కొన్నారు.