calender_icon.png 21 June, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ ఆతిథ్యం కంటే జగన్నాథుడే ముఖ్యం

21-06-2025 01:46:34 AM

భువనేశ్వర్ బహిరంగ సభలో ప్రధాని మోదీ

  1. ఒడిశా పర్యటన కోసం అమెరికా అధ్యక్షుడి ఆహ్వానాన్ని తిరస్కరించా
  2. బీజేపీ ఏడాది పాలన పూర్తి చేసుకోవడంపై ప్రశంసలు
  3. బీహార్‌లో 10వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మోదీ
  4. తాము ‘సబ్ కా సాథ్’ అంటే.. ప్రతిపక్షాలు ‘పరివార్ కా సాథ్’ అంటున్నాయి
  5.  మాఫియా, గూండాగిరిని పెంచి పోషిస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్: ప్రధాని

పట్నా, భువనేశ్వర్, జూన్ 20: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే ఆతిథ్యం కంటే ఒడిశాలోని పూరి జగన్నాథుడి దర్శనమే తనకు ముఖ్యమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శుక్రవారం ప్రధాని మోదీ ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఒడిశాలోని భువనేశ్వర్‌లో చేపట్టిన రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం భువనేశ్వర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు.

‘రెండు రోజుల క్రితం నేను జీ శిఖరాగ్ర సమావేశాల కోసం కెనడా వెళ్లాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాకు ఫోన్ చేశారు. కెనడా వచ్చారు కాబట్టి మార్గమధ్యంలో వాషింగ్టన్‌కు రావడానికి ప్రయత్నించండి. ఇద్దరం కలిసి భోజనం చేసి మాట్లాడుకుందాం అన్నారు. కానీ ట్రంప్ ఆతిథ్యాన్ని తిరస్కరించాను. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు.. జగన్నాథుడు కొలువైన ఒడిశా పర్యటన ఉండటంతో వాషింగ్టన్‌కు రాలేకపోతున్నా అని చెప్పాను.

మహాప్రభువు పట్ల నాకున్న ప్రేమ, భక్తి.. ఆయన్ను దర్శించుకునేందుకు ఒడిశాకు తీసుకువచ్చాయి. ఒడిశాలో బీజేపీ పాలన ఏడాది పూర్తి చేసుకోవడం ప్రశంసనీయం. ఈ వార్షికోత్సవం కేవలం ప్రభుత్వ వార్షికోత్సవం కాదని.. ఇది సుపరిపాలన స్థాపన వార్షికోత్సవమని, దీనిని ప్రజాసేవ, ప్రజా విశ్వాసానికి అంకితం చేస్తున్నాం. ఒడి శా దశాబ్దాలుగా అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. పేదలు, రైతులు పూర్తి హక్కును పొందలేకపోతున్నారు.

అయితే బీజేపీ ప్రభుత్వం గతేడాది కాలంలోనే ఈ సవాళ్లను అధిగమించింది. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఒడిశాకు ప్రయోజనాలు చేకూరుతున్నాయి. గుజరాత్‌లోని సూరత్‌లో ప్రతీ రెండు అడుగులకు ఒక ఒడియా వ్యక్తి కనిపిస్తాడు. దేశంలో నక్సలిజం త్వరలో పూర్తిగా అంతమవుతుంది’ అని వ్యాఖ్యానించారు. అనంతరం నేడు  జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ విశాఖపట్నంకు చేరుకున్నారు.

అంబేదర్క్‌ను అవమానించారు..

అంతకుముందు బీహార్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో  కలిసి 10వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ బీహార్‌లో పర్యటిం చడం ఇది ఐదోసారి. ప్రాజెక్టు పనుల ప్రారంభోత్సవం సివాన్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ప్రధాని అనంతరం ప్రసంగించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్, ఆర్జేడీ కూ టమిపై మోదీ నిప్పులు చెరిగారు. అధికారం కోసం ఆరాటపడేవారకు తమ సొంత కు టుంబాలను ప్రోత్సహించడంపైనే దృష్టి పెడతారన్నా రు. అంబేద్కర్‌ను అవమానించిన వారిని బీహార్ ప్రజలు ఎప్పటికీ క్షమించరని ఆర్జేడీ అధినేత లాలూను ఉద్దేశించి పేర్కొన్నారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అని తమ ప్రభుత్వం చెబుతుంటే..

ఆర్జేడీ, కాంగ్రెస్‌లు మాత్రం ‘పరివార్ కా సాథ్, పరివార్ కా వికాస్’ అంటున్నాయని మోదీ చురకలంటించారు. కాంగ్రె స్, ఆర్జేడీ కూటములు కలిసి బీహార్‌లో గూం డాగిరి, మాఫియాను పెంచి పోషిస్తున్నాయన్నారు. బీహార్ అభివృద్ధిని సుదీర్ఘకాలంగా ‘జంగిల్ రాజ్’ అడ్డుకుం ది. దేశంలో పేదరికానికి కాంగ్రెస్ ‘లైసెన్స్ రాజ్’ కారణమన్నారు. దీనివల్ల సామాన్యులు మా త్రం పేదలుగానే మిగిలిపోయారన్నారు. 

‘అబద్ధాల వర్షం.. వాగ్ధానాల వడగళ్లు’

బీహార్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శలు సంధించారు. పర్యటనలో మోదీ ప్రస్తావించిన వ్యాఖ్యలను వాతావరణంతో పోలు స్తూ.. ‘బీహార్‌లో భారీగా ‘అబద్ధాల వర్షం’ కురిసింది. పెద్ద ఎత్తున ‘వాగ్ధానాల వడగండ్లు’ పడ్డాయి. ప్రజలంతా ఆయన మోసపూరిత వ్యాఖ్యలను నమ్మి బయటకు రావొద్దు.. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని సామాజిక మాధ్య మం ‘ఎక్స్’ వేదికగా పోస్టుపెట్టారు.