05-10-2025 07:50:50 PM
మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ..
బాన్సువాడ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు ఖరారైన నేపథ్యంలో ఆదివారం కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీ నారాయణ హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించదన్నారు.
పేద ప్రజల కనీస అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉచిత గ్యాస్ సిలిండర్, జనధన్ ఖాతాలు, ఉచిత బియ్యం వంటి పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం కేంద్ర నిధులతోనే జరుగుతోందని పేర్కొన్నారు. అక్టోబర్లో జరగనున్న ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉందని, నసురుల్లాబాద్ మండలంలోని ప్రతి స్థాయిలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు.
కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు చందూరిహన్మాండ్లు,మండల ఇన్చార్జ్ మోహన్ రెడ్డి,జిల్లా కౌన్సిల్ సభ్యుడు సున్నం సాయిలు ,వడ్ల సతీష్, మండల ప్రధాన కార్యదర్శులు లక్ష్మణు, శేఖర్, మండల నాయకులు,బూత్ అధ్యక్షులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.