26-06-2025 01:22:49 AM
కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా పర్యవేక్షణ
నిజామాబాద్ జూన్ 25; (విజయ క్రాంతి): కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 29న నిజామాబాద్ జిల్లా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పాల్గొననున్న రైతు సమ్మేళన బహిరంగ సభ కోసం నిర్వహణ ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇందూర్లోని పాలిటెక్నిక్ కళాశాల మైదానాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తదితర అధికారులు కలిసి పరిశీలించారు.
రైతు సమ్మేళ సభ ఏర్పాట్లపై వారు సమీక్ష నిర్వహించి వేదిక, తాత్కాలిక నిర్మాణాలు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, నీటి సరఫరా వంటి అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. భద్రతా చర్యల్లో పొరపాటుకు తావుండకూడదని స్పష్టంగా తెలిపారు.
భద్రతా పరంగా పోలీస్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా చర్చించడమేగాక, ఆర్ అండ్ బి, మున్సిపల్ కార్పొరేషన్, వ్యవసాయ, రెవెన్యూ తదితర శాఖల అధికారుల నిక్షిప్తంగా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, ఇతర నేతలు, అధికారులు కూడా పాల్గొన్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా ఏ దశలోనూ లోపం లేకుండా ఏర్పాట్లు పూర్తిచేయాలని ఎంపీ అరవింద్ పునరుద్ఘాటించారు.