01-06-2025 07:01:13 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): దేశాభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో బీజేపీ వర్క్ షాప్ నిర్వహణ జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరయ్యారు. బీజేపీ వర్క్ షాప్ లో ఆరు ప్రధాన అంశాలపై చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పరిపాలన, యోగా దినోత్సవం నిర్వహణ కోసం రాష్ట్రంలో చేపట్టే కార్యక్రమాలు, వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు, రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన నష్టం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయ పరిణామాలపై వర్క్ షాప్ లో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... దేశాభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే డబుల్ సర్కార్ రావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి వికేంద్రికరణ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి కేంద్రీకృతం అయిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి డబ్బులు తెలంగాణ నుంచే వెళ్తున్నాయని, బీజేపీ తప్ప తెలంగాణను ఏ పార్టీ కాపాడలేదని కేంద్ర మంత్రి తెలిపారు.