నారాయణపూర్లో ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇటీవల నిర్మించిన ఆలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో అంబేద్కర్ కాలనీకి చెందిన మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్ల నడుమ భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.
సంప్రదాయ వేషధారణలో మహిళలు తలపై అలంకరించిన బోనాలు మోసుకుంటూ ఆలయానికి చేరుకోవడం ఆకట్టుకుంది. ఊరంతా పండుగ వాతావరణంలో మునిగిపోయి, భక్తి పరవశంతో కళకళలాడింది. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి మహామంగళహారతులుఅందించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గ్రామంలో శాంతి, సౌభాగ్యం నెలకొలవాలని భక్తులు అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు, మహిళా లు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా బోనాలు జరుపుకున్నారు.




