స్మార్ట్ కిడ్జ్లో హోరెత్తిన బోనాల జాతర సంబురం
“బోనం సమర్పించే భక్తి… అమ్మవారి కరుణ పొందే శక్తి… తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు.”
బోనాలతో కనువిందు చేసిన చిన్నారులు
అమ్మవారికి బోనాలతో ప్రత్యేక పూజలు
ఖమ్మం,(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తున్న బోనాల సంబురాలు స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శుక్రవారం హోరెత్తాయి. డప్పు దరువులతో, పోతురాజు వేషధారణలతో, అమ్మవారి వేషధారణలతో బోనాలు తలపై పెట్టుకుని పాఠశాల విద్యార్థులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. పాఠశాల విద్యార్థులు తమ గృహాలనుంచి బోనాల కుండలతో పాఠశాల ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం బోనాలకు, గౌరీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం బోనాలను తలపై పెట్టుకున్న విద్యార్థినిలు, ఉపాధ్యాయులు బోనాలతో భారీ ఎత్తున గ్రామోత్సవం నిర్వహించి, అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామోత్సవం ముందు పోతురాజు వేషధారణలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బోనాల సంబురాలు ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు.
ఈ బోనాల వేడుకలు మన తెలంగాణ ప్రాంతాలకే గొప్ప గౌరవాన్ని తీసుకుని వస్తున్నాయని, ప్రపంచవ్యాప్తంగా బోనాల సంబరాలకు ప్రత్యేక స్థానం ఏర్పడిందన్నారు. ఈ బోనాల సంబరాన్ని ఇకముందు కూడా కొనసాగించాల్సిన బాధ్యత నవతరం పైనే ఉందని తెలియజేశారు. బోనాల వేడుకల విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బోనాల సంబురాలు నిర్వహించామని, ఈ వేడుకలతో విద్యార్థులలో మన సంస్కృతి, సాంప్రదాయాల పట్ల గౌరవం, ఆనందోత్సవాలు వెల్లి విరిసాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు,విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.






