పెన్షన్ సమస్యలపై డీసీతో బొంతు శ్రీదేవి భేటీ
లైవ్ అథెంటికేషన్ పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచన
కుషాయిగూడ, జూన్ 4 (విజయక్రాంతి): పెన్షన్ల మంజూరు, పెండింగ్ దరఖాస్తులు, లబ్ధిదారుల సమస్యల పరిష్కారంపై కాప్రా మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ రవీందర్ సాగర్తో బొంతు శ్రీదేవి యాదవ్ గురువారం భేటీ అయ్యారు. కొత్త పెన్షన్ల మంజూరు, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ల సకాల పంపిణీపై చర్చించి అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన డీసీ రవీందర్ సాగర్, పెండింగ్ సమస్యలను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కాప్రా సర్కిల్ పరిధిలో పెన్షన్లు పొందుతున్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత కార్మికులు, వికలాంగులు తప్పనిసరిగా లైవ్ అథెంటికేషన్ (ఫేస్ రికగ్నైజేషన్) పూర్తి చేయించుకోవాలని అధికారులు సూచించారు. గడువుకు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఆలస్యం చేయకుండా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు. లేకపోతే పెన్షన్ నిలిచిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడి గడపకు చేరేలా కృషి చేస్తామని బొంతు శ్రీదేవి యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో పెన్షన్ విభాగం అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.






