బాలుడిపై తోటి విద్యార్థుల లైంగిక దాడి

06-05-2024 12:55:15 AM

న్యూఢిల్లీ, మే 5: ఢిల్లీలోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని తోటి విద్యార్థులు లైంగికంగా, శారీరకంగా వేధించడం కలకలం రేపింది. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సపొంది ఇంటికి చేరుకున్నాడు. తన కుమారుడిని ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడి తల్లి అధికారులకు, స్కూల్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేసింది. ఘటనకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించింది. గత మార్చి 28న పాఠశాలకు వెళ్లిన తన కుమారుడిని తోటి విద్యార్థులు రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించారని, బట్టలు విప్పించి కర్రలతో తీవ్రంగా కొట్టారని వివరించింది. బాలుడి శరీరంలోకి కర్రను జొప్పించడంతో పేగులు దెబ్బతిన్నాయని వాపోయింది. ఘటన జరిగిన 10 రోజుల తర్వాత కడుపు నొప్పితో బాధపడుతుండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లామని.. వైద్యులు అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని చెప్పి శస్త్ర చికిత్స చేశారని పేర్కొంది. శస్త్ర చికిత్స తర్వాత స్పృహలోకి వచ్చిన తమ కుమారుడిని ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడని, నిందితులను శిక్షించాలని కోరింది.