19-05-2024 01:21:20 AM
క్యాబినెట్ భేటీ వాయిదా
ఈసీ నుంచి రాని అనుమతి
ఎప్పుడు అనుమతి వస్తే అప్పుడే నిర్వహణ
అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి..
ఈసీని కలిసే ఆలోచనలో సీఎం రేవంత్
హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): రాష్ట్ర మంత్రివర్గం భేటీ వాయిదా పడింది. ఎలక్షన్ కమిషన్(ఈసీ) నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో శనివారం సాయంత్రం 7 గం టల వరకు ఎదురుచూసిన సీఎం రేవంత్రెడ్డి క్యాబినెట్ భేటీని వాయి దావేశారు. దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికల కోడ్ ఉంది. అలాగే రాష్ట్రంలో పట్టభద్రుల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా ఈసీ అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కేంద్ర ఎన్నికల కమిషన్ క్యాబినెట్ భేటీకి అనుమతివ్వలేదు.
దీనితో క్యాబినెట్ సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈసీ నుంచి ఎప్పుడు అనుమతి వస్తే అప్పుడే క్యాబినెట్ భేటీ జరపాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి నిర్ణయం తీసు కున్నారు. సోమవారం లోపు ఈసీ నుంచి అనుమతి రాకపోతే.. అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అనుమతి కోరతామని సీఎం చెప్పారు.
శనివారం మధ్యాహ్నం క్యాబినెట్ సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలను చర్చించాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు. కానీ శనివారం రాత్రి వరకు ఈసీ నుంచి అనుమతి రాలేదు. ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శనివారం జరగాల్సిన క్యాబినెట్ భేటీ నిలిచిపోయింది. ఈసీ నుంచి ఏ క్షణమైనా అనుమతి వస్తుందని మంత్రులంతా శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సచివాలయంలో వేచి ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు అన్ని విభాగాల అధికారులు క్యాబినెట్ భేటీకి హాజరయ్యేందుకు సచివాలయానికి చేరుకున్నారు. కానీ రాత్రి 7 గంటల వరకుకూడా ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో క్యాబినెట్ భేటీ జరగలేదు. సీఎంతోపాటు మంత్రులు వెనుదిరిగి వెళ్ళిపోయారు.
రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలపై ఈ భేటీలో చర్చించాలని అజెండాను సిద్ధం చేసుకున్నారు. కానీ ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో.. రైతుల సంక్షేమం, అత్యవసరమైన అంశాలపై చర్చించలేకపోయామని రేవంత్రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాల్సి ఉంది.
అందుకు సంబంధించిన వేడుకల నిర్వహణతోపాటు పునర్విభజనకు పదేండ్లు పూర్తి కావడంతో ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య పెండింగులో ఉన్న అంశాలు, పునర్విభజన చట్టంలో పెండింగులో ఉన్న కీలకమైన అంశాలను క్యాబినెట్ భేటీలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. క్యాబినెట్ భేటీ వాయిదా పడటంతో ఈ అంశాలపై చర్చ
జరగలేదు.