అరైవ్ అలైవ్ తో ప్రమాదాలకు బ్రేక్
డిఫెన్సివ్ డ్రైవింగ్నే రక్షణ కవచం : సీఐ రాజశేఖర్
చివ్వెంల,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా జిల్లాలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా చేపట్టినట్లు సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపారు. మంగళవారం చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధిలోని దురాజ్పల్లి గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రతి పౌరుడు రోడ్డు నియమ నిబంధనలను పాటించాలన్నారు. ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి వ్యక్తి సురక్షితంగా తిరిగి చేరేలా ప్రయాణంలో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
మండలవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా కొనసాగిస్తామని, ప్రమాద రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా భాగస్వాములు కావాలని కోరారు. ఎస్సై మహేష్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తున్నామని తెలిపారు. చివ్వెంల పరిధిలో జాతీయ రహదారులు ఉన్నందున నిబంధనల అమలుపై కఠినంగా దృష్టి పెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మహేష్ కుమార్, ఎస్ఐ కనకరత్నం, పోలీస్ అధికారులు, గ్రామ పెద్దలు, స్థానిక యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.




