calender_icon.png 19 June, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజుల సవరణకు బ్రేక్

19-06-2025 12:49:40 AM

  1. ఈ సారికి ఇంజినీరింగ్, వృత్తివిద్యాకోర్సులకు పాత ఫీజులే
  2. ఫీజుల సవరణపై అధ్యయనానికి సబ్‌కమిటీ వేయాలని టీఏఎఫ్‌ఆర్సీ నిర్ణయం
  3. ఫీజుల సవరణతో ప్రభుత్వంపై అదనంగా రూ.500-800 కోట్ల భారం
  4. ఈ భారాన్ని భరించలేక పాత ఫీజులా? అని విద్యావర్గాల్లో చర్చ

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): రాష్ర్టంలో ఇంజినీరింగ్ సహా ఇతర ప్రొఫెషనల్ కోర్సుల ఫీజుల సవరణకు బ్రేక్ పడింది. ఫీజులు భారీగా పెరగబోతున్నాయంటూ వస్తున్న విమర్శల నేపథ్యంలో తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) ఫీజుల ప్రతిపాదనకు ప్రభుత్వం బ్రేకులు వేసింది. మరోవైపు ఈ ఫీజుల సవరణతో ప్ర భుత్వంపై భారమూ పడనుండటంతో ఈ ఏడాది పెంపు లేనట్టేనని తెలుస్తోంది.

ఈ విద్యాసంవత్సరంలో పాత ఫీజులే ఉండనున్నాయి. జూలైలో కౌన్సెలింగ్ ప్రారంభంకా నుండగా, పాత ఫీజుల ప్రకారమే సీట్లను భర్తీచేయనున్నారు. ఇప్పటికే టీఏఎఫ్‌ఆర్సీ ప్రతిపా దిత ఫీజులపై సమగ్ర అధ్యయనం చేయాలని, ఇందకు సబ్ కమిటీ వేయాలని బుధవారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. సబ్ కమిటీ ఏర్పాటు బాధ్యతలను తెలంగాణ ఉన్నత విద్యామండలికి అప్పగించారు.

ఫీజుల ఖరారు కోసం టీఏఎఫ్‌ఆర్సీ సమావేశాన్ని బుధవారం మాసాబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో నిర్వహించారు. టీఏఎఫ్‌ఆర్సీ చైర్మన్ జస్టీస్ గోపాల్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్, మహత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఫీజుల సవరణపై చర్చించారు. ఇప్పటికే టీఏఎఫ్‌ఆర్సీ పలు కాలేజీల ఫీజులను ఖరారుచేయగా, కొన్ని కాలేజీల్లో ఫీజులు భారీగా పెరిగాయి. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయా ఫీజుల సవరణపై మరోమారు అధ్యయనం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. తాజా నిర్ణయంతో ఇంజినీరింగ్‌తోపాటు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ ఇతర వృత్తి విద్యాకోర్సుల ఫీజుల సవరణకు కూడా బ్రేకులు పడినట్టేనని స్పష్టమవుతోంది.

ప్రభుత్వంపై రూ.800 కోట్లు భారం

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సతమతమవుతుంటే రాబోయే మూడేళ్లకు ఫీజుల సవరణ అంశం గుదిబండగా మారింది. ఇప్పటికే మూడేళ్లకు దాదాపు రూ.8 వేల కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ప్రస్తుత ఫీజుల ప్రకారమైతే ఏటా ప్రభుత్వంపై రూ.2,300 కోట్లకుపైగా ఫీజుల భారం పడుతోంది. దీనికితోడు మళ్లీ ఫీజులు పెరిగితే సుమారు రూ.500 కోట్ల భారం పడే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

అసలే వస్తున్న ఆదాయానికి, వ్యయానికి భారీగా వ్యత్యాసముంది. ఈక్రమంలో కొత్తగా ఫీజులు పెంచితే మరింత కష్టతరమవుతుందని భావించిన సర్కారు, పాత ఫీజులనే కొనసాగించాలని యోచిస్టున్నట్టు సమాచారం. ఏటా మూడేళ్లకోసారి ఫీజుల సవరణ ఉంటుంది. ఒక్క సారి ఖరారైతే అవే ఫీజులు అమలవుతాయి.

ఈక్రమంలోనే టీఏఎఫ్‌ఆర్సీ ప్రతిపాదిత ఫీజులపై అధ్యయంన చేయాలని అధికారులను సర్కారు ఆదేశించినట్టు తెలుస్తోంది. గతంలోనూ తొలుత పాత ఫీజులను వసూలు చేసిన కాలేజీలు, ఆ తర్వాత పెరిగిన ఫీజులకు అనుగుణంగా మిగతా ఫీజులను వసూలు చేయడం గమనార్హం.