ప్రతి శిశువుకు తల్లిపాలు తొలి ఆహారం
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి, ఆగస్టు 3 (విజయ క్రాంతి) : శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలు అత్యంత విలువైన తొలి ఆహారమని, పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు పట్టించడం ద్వారా అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించే పోస్టర్ను సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శిశువు పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలను శిశువు కు తప్పనిసరిగా అందించాలని తెలిపారు.
అవి శిశువుకు సహజ రోగనిరోధక శక్తిని పెంపొందించి, ఆరోగ్యకరమైన ఎదుగుదలకు బలమైన పునాది వేస్తాయని అన్నారు. తల్లి-శిశువు మధ్య బంధం మరింత బలపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జ్యోతి, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితా దేవి, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, ఆర్డీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.






