calender_icon.png 29 June, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహా న్యూస్ కార్యాలయంపై బీఆర్‌ఎస్ దాడి

29-06-2025 01:39:56 AM

  1. అగ్రనేతలపై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆరోపణ

ఆఫీసులోకి చొరబడి అద్దాలు, స్టూడియో ధ్వంసం

పోలీసులకు ఫిర్యాదు చేసిన యాజమాన్యం

బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహ ఇతర నాయకుల అరెస్ట్

టీవీ చానల్ కార్యాలయాన్ని సందర్శించి పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం

ప్రజాస్వామ్యంలో దాడులు సమర్థనీయం కాదు: సీఎం రేవంత్‌రెడ్డి

దాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తదితర నేతలు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని, ఉద్దేశపూర్వకంగా అసత్య కథనాలు ప్రసారం చేస్తోందని ఆరోపిస్తూ మహా న్యూస్ చానల్ కార్యాలయంపై బీఆర్‌ఎస్ శ్రేణులు బుధవారం దాడికి పాల్పడ్డాయి. ఈ దాడి ఘటన జరిగిన వెంటనే మహా న్యూస్ కార్యాలయా న్ని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సంద ర్శించి, యాజమాన్యానికి సంఘీభావం ప్రకటించారు.

నిందితులపై చర్యలు తీసుకుం టామన్నారు. దాడి ఘటనపై చానల్ యాజమా న్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తెలంగా ణ భవన్‌కు వెళ్లగా వారిని బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి.

పోలీసులతో బీఆర్‌ఎస్ నేతలు, నాయకులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు భారీగా మోహరించారు. ఎట్టకేలకు బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితర నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసును తప్పుదోవ పట్టిస్తోందని..

బుధవారం మధ్యాహ్నం బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా మహా న్యూస్ టీవీ కార్యాలయం వద్దకు చేరుకుని ‘మహా టీవీ డౌన్ డౌన్.., తప్పుడు కథనాలు నశించాలి..’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు కార్యాలయం బయట ఉన్న ఫ్లెక్సీలను, బోర్డులను చించివేసి,  ఆఫీసులోకి జొరబడి, అద్దా లు పగులగొట్టారు.

స్టూడియోను ధ్వంసం చేశారు. అక్కడున్న కార్ల అద్దాలు పగులగొట్టారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఆం దోళనకారులను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ‘ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను మహా టీవీ తప్పుదోవ పట్టిస్తోంది.. కేవలం ఒక వర్గం వాదనను మాత్రమే వినిపిస్తూ మా అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఏకపక్ష కథనాలు ప్రసారం చేస్తోంది.. ఇది వ్యక్తిత్వ హననమే.

ఇలాంటి వార్తలను వెంటనే ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..’ అని బీఆర్‌ఎస్ నాయకులు హెచ్చరించారు. ఈ దాడిని జర్నలిస్టు సంఘాలు, పలు మీడియా సంస్థలు తీవ్రంగా ఖండించాయి. వార్తలపై అభ్యంతరాలుంటే చట్టపరంగా ఎదుర్కోవాలి కానీ, కార్యాలయాలపై దాడులకు పాల్పడటం అప్రజాస్వామికమన్నారు. ఇది పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడి అని అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా వ్యవహరించడం బీఆర్‌ఎస్ అసహనానికి నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.

ప్రజాస్వామ్యంలో దాడులు సమర్థనీయం కాదు: సీఎం రేవంత్‌రెడ్డి

మహాటీవి కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం ఎక్స్‌లో ఆ చానెల్‌ని ట్యాగ్ చేస్తూ సీఎం ట్వీట్ చేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు సమర్థనీయం కాదన్నారు. ఈ ఘటనపై పోలీసు లు విచారణ చేస్తున్నారు. తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడుతుందని  హెచ్చరించారు. మీడియా గొంతునొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

ఇది ప్రజాస్వామ్య విధానం కాదు: భట్టి

ఘటన జరిగిన వెంటనే ఉప ముఖ్యమం త్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ నేరుగా మహా న్యూస్ కార్యాలయానికి వెళ్లి, ధ్వంసమైన పరికరాలను, వాహనాలను పరిశీలించారు. యాజమాన్యానికి, సిబ్బందికి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వం తరఫున ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కథనాలపై అభ్యంతరాలుంటే న్యాయపరంగా వెళ్లాలి కానీ, ఇలా భౌతిక దాడులకు పాల్పడటం అరాచకమన్నారు. హైదరాబాద్‌కు పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభు త్వం కృషి చేస్తుంటే, కొందరు శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం సరికాదన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు.

మీడియాపై దాడి దుర్మార్గం: ఏపీ సీఎం చంద్రబాబు 

మీడియాను బెదిరింపులతో కట్టడి చేయాలనుకోవడం దుర్మార్గమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు. మహా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి తన పూర్తి సంఘీభావం ఉంటుందని ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు.

భౌతిక దాడి గర్హనీయం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 

మహా న్యూస్ చానల్ కార్యాలయం దాడి గర్హనీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి కారకులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

దాడిని ఖండించిన పలువురు నాయకులు..

నిజాలు చెప్పినందుకు దాడులు చేయ డం బీఆర్‌ఎస్ ఫ్యాక్షన్ సంస్కృతికి నిదర్శనమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శిం చారు. అభ్యంతరాలుంటే చట్టపరంగా ఫిర్యా దు చేయాలని సూచించారు. సీపీఎం నేత నారాయణ మహా న్యూస్ కార్యాలయాన్ని సందర్శించి, దాడిని ఖండిస్తూ తన సంఘీభావం ప్రకటించారు. బీజేపీ నాయకులు, ఇతర ప్రజా సంఘాల నేతలు వచ్చి, యాజమాన్యానికి మద్దతు తెలిపారు.

బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అరెస్ట్

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మహాటీవీలో కేటీఆర్ పై ప్రసారమైన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు టీవీ చానల్ కార్యాలయంపై దాడి చేయడంతో యాజమాన్యం పోలీ సులకు ఫిర్యాదు చేసింది. దాడిలో బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కీలకపాత్ర పోషించారంటూ పోలీసులు శనివారం మధ్యాహ్నం  తెలంగాణభవన్‌కు వచ్చారు.

అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా, భారీ ందోబస్తుతో పోలీసులు తెలంగాణభవన్‌లో ఉన్న బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు బీఆర్‌ఎస్వీ నేతలను అరెస్టు చేసి స్టేషన్‌కి తీసుకెళ్లారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.

మీడియా అది గుర్తుంచుకోవాలి: హారీష్ రావు

ఒక మీడియా చానెల్ తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అసభ్య మైన, వ్యక్తిగత దాడులను ప్రసారం చేస్తూ రాజకీయ ఎజెండాను ముందు కు తీసుకురావడానికి కొత్త స్థాయికి దిగజారిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు ఆరోపించారు.

శని వారం ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేస్తూ ప్రతి నాయకుడి వెనక ఒక కుటుంబం ఉంటుందని మీడియా సంస్థలు గు ర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ దుర్మార్గపు ప్రచారానికి వ్యతిరే కంగా చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు కేటీఆర్‌కు ఉందని, మేము ఆయనకు మద్ధతుగా ఉంటామని ప్రకటించారు.