29-06-2025 01:44:20 AM
ప్రియుడు పూర్ణచందర్ పరారీపై అనుమానాలు
నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
తన కుమార్తె చావుకు పూర్ణచందరే కారణమంటున్న తండ్రి
పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపణ
హైదరాబాద్, సిటీ బ్యూరో జూన్ 28 (విజయక్రాంతి)/ముషీరాబాద్: టీ న్యూస్ చానెల్ యాంకర్ స్వేచ్ఛ (40) బలవన్మరణం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. హైదరాబాద్లోని తన నివాసంలో శుక్రవారం రాత్రి ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు.
మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్ణచందర్ అనే వ్యక్తి తమ కుమార్తెతో మూడేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నాడని, పెళ్లిచేసుకుంటానని మోసం చేయడంతోనే స్వేచ్ఛ బలవన్మరణానికి పాల్పడిందని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరోవైపు స్వేచ్ఛ బలవనర్మణం తర్వాత ఆమె ప్రియు డు పూర్ణచందర్ పరారయ్యాడు. పూర్ణచందర్ పరారవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అతడి ఫోన్ కాల్ డేటాను కూడా విశ్లేషిస్తున్నట్లు సమాచారం.
అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు..
ముషీరాబాద్ గాంధీ ఆసుపత్రిలో శనివారం ఉదయం స్వేచ్ఛ మృతదేహానికి పోస్టు మార్టం పూర్తి కాగా, మృతురాలి తల్లిదండ్రు లు తొలుత మృతదేహాన్ని తమ ఇంటి వద్దకు తీసుకువచ్చారు. స్వేచ్ఛను కడసారి చూసేందుకు బంధుమిత్రులు, ప్రజా సంఘాల నేత లు, పెద్దఎత్తున స్థానికులు తరలివచ్చారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో వం దలాది మంది పాల్గొన్నారు.
మృతురాలి తల్లిదండ్రులు అనంతరం పార్సిగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తిచేశారు. ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, వేముల వీరేశ్, కాలేరు వెంకటేశ్, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి, తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ భోభారాణి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, సీపీఐఎంఎల్ నాయకులు గోవర్ధన్, ప్రదీప్, విరసం విమలక్క, మాజీ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న,
పీవోడబ్ల్యూ నేత సంధ్య, ప్రెస్ ఆకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ సంపాదకులు కే శ్రీనివాస్, పక్షం ఎడిటర్ వేణు గోపాల్, పాత్రికేయులు సజయ, విరాత్ అలీ, సోమయ్య, ఖాదర్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య తదితరులు స్వేచ్ఛ మృతదేహానికి నివాళి అర్పించారు.
కేసీఆర్, కేటీఆర్ సంతాపం
జర్నలిస్టు స్వేచ్ఛ వొటార్కర్ మృతికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతా పం ప్రకటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. యాంకర్ స్వేచ్ఛ బలవనర్మణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఓ ప్రకటనలో తెలిపారు. ధైర్య సాహసాలు కలిగిన జర్నలిస్ట్గా, కవయిత్రిగా స్వేచ్ఛకు పేరున్నదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్నారని శ్లాఘించారు.
నా కుమార్తె మృతికి పూర్ణచందర్ కారణం: మృతురాలి తండ్రి
స్వేచ్ఛ మృతిపై తండ్రి శంకర్ సంచలన విషయాలు బయపెట్టారు. గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద శనివారం ఆయన మీడితో మాట్లా డుతూ.. తన కుమార్తెను పూర్ణచందర్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని మూడేళ్ల నుంచి వెం టపడ్డాడని, అతడికి అప్పటికే వివాహమై, పిల్లలు కూడా ఉన్నారని వెల్లడించాడు. తన భర్తతో విడిపోయిన స్వేచ్ఛ తర్వాత పూర్ణచందర్తో కలిసి ఉం టుందన్నాడు.
తన కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పి, పూర్ణచందర్ ఆ మాట నిలబె ట్టుకోలేదన్నాడు. అతడి చేతిలో తన కుమార్తె మోసపోయిందని వాపోయాడు. స్వేచ్ఛను కొద్దిరోజులుగా మానసికంగా వేధిస్తున్నాడని అన్నా డు. వారిద్దరి మధ్య గొడవ లు తారాస్థాయికి చేరుకు న్నాయని, ఈక్రమంలోనే స్వేచ్ఛ జూన్ 26న తనను ఇంటికి పిలిచి, ఇక పూర్ణచందర్తో కలిసి ఉండలేనని చెప్పిందన్నారు.
పూర్ణచందర్ టీ న్యూస్ చానెల్లో కల్చరల్ ప్రోగ్రాం డిజైనర్గా పని చేసేవాడని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అతడు సన్నిహితుడని వెల్లడించాడు. ఆ పార్టీ నేత సంతోశ్కుమార్ చేపట్టే గ్రీన్ ఇండియా చాలెంజ్ లోనూ అతడు క్రియాశీలకంగా పనిచేసేవాడని తెలిపాడు. పూర్ణచందర్ ఒక్క తన కూతుర్నే కాకుండా ఎంతోమంది యువతల జీవితాలను నాశనం చేశాడని ఆరోపించాడు. పోలీసులు పూర్ణచందర్ను కఠినంగా శిక్షించి, మరో అమ్మాయి జీవితం నాశనం కాకుండా చూడాలని కోరాడు.
పూర్ణచందర్ మంచివాడు కాదు : మృతురాలి కుమార్తె
మృతురాలి కుమార్తె మాట్లాడుతూ.. పూర్ణచందర్ తరచూ తమ ఇంటకి వచ్చే వాడని, తల్లి చనిపోయిందని పూర్ణచందర్కు సమాచారం ఇచ్చి నా ఆయన ఇంటికి రాలేదని వెల్లడించింది. తన తల్లి మరణానికి పూర్ణచంద రే కారణమని ఆరోపించింది.
తన తల్లి కూడా పూర్ణచందర్ మంచివాడు కాదని ఎన్నోసార్లు తనకు చెప్పిందని, తాను కూడా అతడిని వదిలేయమని చెప్పి చూశానని, అయినప్పటికీ తన మాట వినలేదని వాపోయింది. తనను ఎల్లప్పుడూ జాగ్రత్త ఉండాలని తన తల్లి చెప్పేదని కన్నీరు మున్నీరైంది.