18-02-2026 03:22:09 PM
- చైర్ పర్సన్ స్వాతి
- బీఆర్ఎస్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం..
బెల్లంపల్లి,(విజయక్రాంతి): రాజకీయాలు పక్కన పెట్టీ బెల్లంపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి అన్నారు. నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం బుధవారం మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలోఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆమె బీఆర్ఎస్ కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వాతి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేద్దామన్నారు.
బెల్లంపల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని తన లక్ష్యానికి సభ్యులు రాజకీయాలను పక్కనపెట్టి చేయూత నివ్వాలన్నారు. ప్రజలు తమను గెలిపించిన విషయాన్ని ప్రతి సభ్యుడు గుర్తుపెట్టుకుని రాగ ద్వేషాలకు అతీతంగా బెల్లంపల్లి ప్రజల కు సేవలందిద్దామని అన్నారు. అందరం కలసి అభివృద్ది లక్ష్యంగా ముందుకు పోదామని అన్నారు. ప్రజలు తమ పై పెట్టుకున్న ఆశల్ని నిజం చేద్దామన్నారు. ప్రజలకు సేవలు, పట్టణ అభివృద్ధి తప్పైతే మనకు రాజకీయాలు అక్కరలేదనీ వెల్లడించారు. ఈ దిశగా ముందుకు పోదామని దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రమాణం..
బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన 14 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. చట్టబద్ధంగా ప్రమాణ పత్రాన్ని ప్రతి ఒక్కరూ చదివి ప్రతిజ్ఞ, ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ సభ్యులకు మునిసిపల్ చైర్ పర్సన్ దావస్వాతి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాగం శెట్టి సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.
- ప్రత్యేక బస్సులో బెల్లంపల్లికి గులాబీ సభ్యులు..
బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం కోసం ప్రత్యేక వాహనంలో మున్సిపల్ ఆఫీసుకు చేరుకున్నారు. బస్సులో కన్నాల పంచముఖి విగ్రహం వద్దకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బీఆర్ఎస్ కౌన్సిలర్లను ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బీ ఆర్ ఎస్ శ్రేణులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు.