calender_icon.png 30 May, 2025 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంచనాలు పెంచడం.. కమీషన్లు దండుకోవడం

29-05-2025 01:00:15 AM

మాజీమంత్రి హరీశ్‌రావు ధ్వజం

హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట వేలకోట్లు దండుకునేందుకు కాంగ్రెస్ మరో నాటకమాడుతోందని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.

డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఈనెల 24న ఆదిలాబాద్‌లో మాట్లాడుతూ రూ.80,-100కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామని ప్రకటించారన్నారు. బుధవారం ఎక్స్‌లో హరీశ్‌రావు పోస్టు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2024 అక్టోబర్ 11న రూ.125కోట్ల వ్యయంతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు.

వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2025 మే రెండో వారంలో రూ.135- నుంచి 150 కోట్లతో టెండర్లు సైతం ఖరారు చేశారని హరీశ్‌రావు పేర్కొన్నారు. మే 27, 2025 నాడు, 20 స్కూల్స్ నిర్మాణానికి సంబంధించి 4,000 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జీవో నెంబర్ 96 విడుదల చేశారని చెప్పారు.

ఒక్కో స్కూల్ అంచనాలను ఏ పని మొదలుకాకుండానే దాదాపు మూడు రెట్లు అంటే రూ. 200కోట్లకు పెంచారని ఆరోపించారు. జలయజ్ఞం నుంచి రెసిడెన్షియల్ స్కూళ్ల వరకు అంచనాలను పెంచడం, కమీషన్లు దండుకోవడం.. ఇదే కదా కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన అని హరీశ్ విమర్శించారు.