04-12-2025 08:22:07 PM
మానకొండూరు (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న కీలక తరుణంలో మానకొండూరు మండలంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మండల పరిధిలోని ఊటూరు గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్ లో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గురువారం కండువాలు కప్పి వారిని హస్తం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులవడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి తిరోగమన దిశగా సాగిందని, అవినీతి, అక్రమాలతో రాష్ట్ర ఖజానాకు తూట్లు పొడిచారని ఆరోపించారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడారని ఆయన గుర్తు చేశారు. రంగాలను అభివృద్ధి పర్చాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతూ పారదర్శక పాలన అందిస్తోందన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గూడు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కలగా మారగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ఇస్తూ వారి సొంతింటి కలను సాకారం చేస్తున్నదన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి తెలిపారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన కోరారు. గ్రామ అభివృద్ధిలో పంచాయతీ ఎన్నికలు కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సర్పంచులుగా కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. మనోళ్లను గెలిపించుకోవడం ద్వారా ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు మంజూరు చేయించుకోవడానికి అవకాశాలుంటాయన్నారు. అంతే కాకుండా ఎమ్మెల్యేగా తన సహకారం ఎలాగూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఊటూరు గ్రామశాఖ అధ్యక్షుడు బొంగోని సునిల్ గౌడ్, పార్టీ నాయకులు గోపు శ్రీనివాస్ రెడ్డి, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థి వెలిశెట్టి కళ్యాణి-కిశోర్ తదితరులు పాల్గొన్నారు.