సీఎం సొంత జిల్లాలో ఎమ్మెల్సీ మనమే గెలిచాం: కేసీఆర్
మహబూబ్ నగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీగా గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపు పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని కేసీఆర్ గుర్తుచేశారు. 100కు పైగా ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిందన్నారు.
నూతన ఉద్యమ పంథాను ఆవిష్కరించాల్సిన సమయం వచ్చిందన్నారు. రాజకీయ ఫలితాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. రాజకీయ జయాపజయాలు తమకి లెక్కకాదన్నారు. ప్రజలకు ఆవేశం వస్తే ఎవరు ఆపినా ఆగరని చెప్పిన కేసీఆర్ సమీప భవిష్యత్ లో పాలన బీఆర్ఎస్ భుజాలపైనే పడుతోందని ఆయన సూచించారు. ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం ఒక్క అంశంపైన కూడా విధానం ప్రకటించలేదన్నారు. అధికారిక చిహ్నం ప్రజల గుండెల్లో ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
అటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకలు జరుగుతన్న తరుణంలో ఆదివారం జరిగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 763 ఓట్ల సాధించి, కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి పై 108 మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. మంగళవారం లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో బీఆర్ఎస్ విజయం అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ గా మారింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచిన కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.






