7 May, 2026 | 2:57 AM

రైతు సంగ్రామ సభ సక్సెస్

07-05-2026 02:15 AM

కార్యకర్తల్లో జోష్ నింపిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగం

సామాన్య ప్రజల్లోనూ సభపై ఆసక్తి

వేలాదిగా తరలివచ్చిన రైతులు, పార్టీ శ్రేణులు

మహబూబాబాద్, మే 6 (విజయక్రాంతి): రైతు సంగ్రామ సభ బీఆర్‌ఎస్ కార్యకర్తల్లో జోష్ నింపింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ వైఫల్యాలలను ఎత్తిచూపుతూ, పాలనా లోపాలను వివరిస్తూ చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

గత పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనను ప్రస్తుత కాంగ్రెస్ పాలనను పోల్చుతూ వివరించిన తీరు రైతులు, పార్టీ శ్రేణుల్లో ఆలోచనలకు తెరలేపింది. ‘ఓరుగల్లుకు వందనం.. పోరుగల్లుకు వందనం.. ఓరుగల్లు కాకతీయుల పౌరుషాల గడ్డ.. కవి కాళోజీ ఆత్మగౌరవ గడ్డ.. ప్రొఫెసర్ జయశంకర్ సార్ పుట్టిన గడ్డ.. ఇక్కడినుంచి పోరాటాల విల్లు ఎక్కు పెడితే ద్రోహుల గుండె జల్లుమంటుంది.. అందుకే బీఆర్‌ఎస్ ఏ కార్యక్రమం చేపట్టినా వరంగల్‌నే వేదికగా చేసుకుంటుంది.. ఆ మేరకు మీరంతా ప్రవాహంలా తరలివచ్చి ప్రభుత్వానికి గుండె దడ తెప్పించారు’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

కేసీఆర్ ఎలుకతుర్తిలో నిర్వహించిన సభకు వచ్చిన విధంగానే, బుధవారం నిర్వహించిన రైతు సంగ్రామ సభకు అశేష జనవాహిని హాజరుకావడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. రైతు మహా సంగ్రామ సభకు అనేక అడ్డంకులు ప్రభుత్వం కల్పించిందని, అయినప్పటికీ ఎక్కడ కూడా వెనకాడకుండా సంగ్రామ సభ నిర్వహించి విజయవంతం అయ్యామని నేతలు ఆనందం వ్యక్తం చేశారు.

వరంగల్ నగరం మరోసారి రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. బీ ఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రైతు సంగ్రామ సభకు అద్భుత ఏర్పా ట్లు చేయడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. వేలాదిమంది రైతులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్న ఈ మహాసభకు అన్ని ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన చేపట్టి విజయవంతంగా ముగించడంపై నాయకులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

రైతుల సమస్యలపై దృష్టి

ఈ సభలో ముఖ్యంగా రైతుల సమస్య లు, వ్యవసాయ విధానాలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై చర్చ నిర్వహించారు. రైతు సంక్షే మం కోసం, కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలు చేయాలంటూ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ తీర్మానించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి వచ్చిన స్పందన ఈ సభకు విశేష ప్రాధాన్యతను తీసుకొచ్చింది. 

ప్రజల్లో ఉత్సాహం

సభపై రైతుల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లో కూడా ఆసక్తి పెరిగింది. గ్రామాల నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. వరంగల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ రైతు సంగ్రామ సభ ఏర్పాట్లు పార్టీ శక్తిసామర్థ్యాన్ని మరోసారి ప్రతిబింబించాయి. ఈ సభ ద్వారా రైతు సమస్యలు మరింత బలంగా వెలుగులోకి రావడమే కాకుండా రాజకీయంగా కూడా బీఆర్‌ఎస్‌కు కీలక మలుపు తిప్పే అవకాశం లభించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేటీఆర్ తన వాగ్దాటితో ప్రభుత్వాన్ని, పాలకపక్ష నేతలను ఘాటైన పదజాలంతో విమర్శించి పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నిం పారు. త్వరలో జరగబోయే వరంగల్ నగర పాలక సంస్థ ఎన్నికలకు ఈ రైతు మహా సంగ్రామ సభ సక్సెస్ దోహదపడే అవకాశా లు ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ సభ ఆధ్యాంతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగడం మరో విశేషం.