29-09-2025 12:24:00 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి) : హైదరాబాద్- విజయవాడ (ఎన్హెచ్ 65) జాతీయ రహదారి 8 లేన్ల విస్తరణకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని వచ్చే ఫిబ్రవరిలో పనులు ప్రారంభమవుతాయని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాక్సిడెంట్ ఫ్రీ రహదారిని అందుబాటులోకి తీసుకొస్తామని, అధునాతన టెక్నాలజీతో, పూర్తి నాణ్యతతో నిర్మించబోతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉండటమే కాకుండా యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్న రహదారుల్లో ఒకటని, ఇప్పటికే 17 బ్లాక్ స్పాట్స్ గుర్తించి ఫ్లు ఓవర్లు నిర్మిస్తున్నామన్నారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసినప్పుడు ఈ అంశాన్ని గుర్తు చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. 8 వరుసల రహదారి పనులు పూర్తయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చన్నారు.
భారత్ ప్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 230 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవే పట్ల కేంద్ర మంత్రి గడ్కరి సానుకూలంగా ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. డీపీఆర్ ఎస్టిమేట్స్ త్వలరో పూర్తి కానున్నాయని, గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి వేగంగా అడుగులు ముందుక పడుతున్నాయని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడార్ తెలుగు రాష్ట్రాల అభివృద్దిలో గేమ్ చేంజర్గా నిలవబోతుందన్నారు.