కాళేశ్వరం బాలాలయంలో భక్తుల సందడి
15-08-2026 02:11 PM
భూపాలపల్లి కాళేశ్వరం ఆగస్ట్ 15 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం లోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి బాలాలయంలో శ్రావణమాసం శనివారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ముందుగా గోదావరి తీరంలో పవిత్ర స్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ బాలాలయంలో శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పలువురు భక్తులు కాలసర్ప, శని దోష నివారణ పూజలు నిర్వహించుకుని స్వామివారి ప్రసాదాలు స్వీకరించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో మహేష్, చైర్మన్ మోహన్ శర్మ, పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయ సిబ్బంది భక్తులకు అవసరమైన సేవలను అందించారు.






