29-05-2025 12:58:28 AM
-అవసరానికి సర్దుబాటు కాని పరిస్థితి
-ఇబ్బంది పడుతున్న పేద, మధ్యతరగతి వర్గాలు
-ఎవరిని కదిలించినా డబ్బు సమస్యనే..
-పల్లె, పట్నం అంతటా ఇదే తీరు
సంగారెడ్డి, మే 28(విజయక్రాంతి): జీవన అవసరాలకు గతంలో డబ్బులు అవసరం ఉందంటే ఎవరో ఒకరు సర్దుబాటు చేసేవారు. స్నేహితులు, బంధువులు చేబదలు ఇచ్చేవారు. లేదంటే ఆప్పునా పుట్టేది.
వాటితో అవరాలు వెళ్లదీసుకుని, డబ్బులు సర్దుబాటు అయ్యాక తిరిగి చెల్లించేవారు. వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్ నిర్వాహకులు కూడా నమ్మకం ఉన్న వారికి అప్పులిచ్చేవారు. ఇప్పుడు పరిస్థితులు తలకిందులయ్యాయి. అవసరానికి డబ్బులు సర్దుబాటు కావడం లేదని, కనీసం అప్పు కూడా పుట్టడం లేదని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని సందర్భాల్లో ఆపదలో కూడా డబ్బులు సర్దుబాటు కాక పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. వ్యవసాయంలో పెట్టుబడులు పెరగడం, దిగుబడులు తగ్గడంతో కష్టానికి ఫలితం దక్కడం లేదు. ఏడాదికేడాది అప్పులు పెరగడమే తప్ప మిగులుబాటు లేకుండా పోతుంది.
కుల వృత్తులు, స్వయం ఉపాధి చేసుకునేవారు కూడా అద్దెలు, విద్యుత్ బిల్లులు, నిర్వహణ వ్యయం పెరిగిపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్చిన్న వ్యా పారాలు చేసుకునేవారు కూడా మడిగెల అద్దెలు భా రంగా మారడం, వ్యాపారంలో పోటీ పెరగడంతో వారి ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింది.
రోజువారీ పనులు చేసుకునేవారి సంపాదన బట్టకు, పొట్టకు అన్నట్టుగా తయారైంది. పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, ప్లాటు కొనుగోలు, ఇంటి నిర్మాణం.. ఇలా దేనికై నా అప్పులు చేయాల్సినని పరిస్థితి. అయితే ఏ అవసరం ఉన్నా ఎవరో ఒకరు డబ్బులు సర్దుబాటు చేస్తారన్న నమ్మకం లేకుండా పోయింది. దీంతో చాలామంది మనోవేదనకు గురవుతున్నారు.
కలిసిరాని కాంట్రాక్టు పనులు...
ప్రభుత్వ అభివృద్ధి పనుల కాంట్రాక్టులు చేసి నాలుగు డబ్బులు వెనకేసుకోవాలని కొందరు కింది స్థాయి నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అప్పులు చేసి పనులు పూర్తి చేశారు. ఏళ్లు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు చాలా మంది రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా పనుల మీద పెట్టుబడులు పెట్టారు.
వారంతా రెండు, మూడేళ్లుగా బిల్లులు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఓ మారుమూల గ్రామ సర్పంచ్ చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో భూమిని అమ్ముకుని అప్పులు కట్టాడు. లాభాల మాట అటుంచితే అప్పుల కింద ఉన్న భూమి పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చిన్నచిన్న కాంట్రాక్టర్లతో పాటు బడా కాంట్రాక్టర్లు కూడా బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారు.
’రియల్’ కుదేలై..
చాలామంది భూముల మీద పెట్టుబడులు పెట్టారు. భూముల క్రయవిక్రయాలతో సులువుగా డబ్బులు సంపాదించవచ్చనే భావనతో డబ్బున్న వారితో పాటు మధ్య తరగతి ప్రజలు కూడా అప్పులు చేసి మరీ భూములు కొన్నారు. అయితే కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలై భూములు, ప్లాట్ల క్రయవిక్రయాలు సాగడం లేదు.
సంవత్సరాల తరబడిగా వ్యాపారంలో వృద్ధి లేకపోగా, ధరలు పడిపోయాయి. అయినా సరే అమ్ముదామంటే కొనేవారు లేకపోవడంతో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన వారంతా ఇంకా మునిగిపోతున్నారు. జిల్లా కేంద్రంలో ఇళ్లు నిర్మించి అమ్మేవారు ప్లాట్లతో పాటు ఇళ్ల నిర్మాణానికి డబ్బులు వెచ్చించారు.
ఇప్పుడు ఇళ్లు అమ్ముడుపోక అవన్నీ ఇరుక్కుపోయాయి. దీంతో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన వారంతా దివాలా అంచున ఉన్నారు. ప్లాటు ధర, ఇంటి నిర్మాణానికి అయిన వ్యయం ఇచ్చినా సరే అమ్ముదామంటే కొనేవాళ్లు లేరని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వడ్డీలకు వడ్డీలు పెరిగి అవస్థలు పడుతున్నామంటున్నారు.
ఫైనాన్స్ దందా ఆగం..
అప్పులు తీసుకున్న వారు చాలా మంది డబ్బులు సర్దుబాటు కాక చేతులెత్తేయడంతో కొందరు ఫైనాన్స్ వ్యాపారులు దెబ్బతిన్నారు. దీనికి తోడు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారంటూ పోలీసులు ఫైనాన్స్ నిర్వాహకులు, వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు నిర్వ హిస్తున్నారు.
దీంతో చాలా మంది వడ్డీ, ఫైనాన్స్ వ్యాపారులు దందాను వదిలేశారు. కొందరు ఫైనాన్స్, వడ్డీ వ్యాపారులు కూడా డబ్బులు రికవరీ కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వరుస దెబ్బలతో ఫైనాన్స్ రంగం కుదేలైంది. వెరసి సామాన్యుడికి అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడింది.
బంగారమే ఆధారం..
బయట అప్పు పుట్టని పరిస్థితుల్లో బంగారమే ఆధారమవుతోంది. చాలామంది బ్యాంకుల్లో బంగారం, ఆభరణాలు తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటున్నారు. బంగారం అమ్మితే తిరిగి కొనలేమని కుదువ పెడుతున్నారు.
ప్రతి బ్యాంకులో నిత్యం ఐదు నుంచి పది మంది గోల్ లోన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మారుమూల గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల దాకా బ్యాంకుల్లో గోల్ లోన్లు విపరీతంగా తీసుకుంటున్నారు. ఏ అవసరం ఉన్నా సరే ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి అప్పు పొందుతు న్నారు.