29-05-2025 12:55:39 AM
టెలికాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి, మే 28(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2వ తేదీన రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసే నేపథ్యంలో జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా, నిజాయితీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు.
జిల్లాలో వివిధ సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై అదనపు కలెక్టర్లు, గృహ నిర్మాణ, నీటిపారుదల, మున్సిపల్, మండల అభివృద్ధి అధికారులతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని, ఈ పథకం అర్హత గల వారిని ఎంపిక చేయాలని అధికారులు ఆదేశించారు.
రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల లిస్ట్ ఫైనల్ చేసి బ్యాంకర్లకు పంపిణీ చేసి, బ్యాంకర్ల నుంచి అధికారులు లిస్ట్ తీసుకోవాలన్నారు. రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై మాట్లాడుతూ అర్హత గల పేదలందరికీ రెండో విడత ఇందిరమ్మ ఇల్లు అందించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో ఎలాంటి ఇసుక కొరత లేదని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుకనందిస్తున్నామని తెలిపారు.
రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల జాబితా త్వరితగతిన అందించాలని అధికారుల ఆదేశించారు. ముందుగానే ఋతుపవనాలు రావడం వల్ల వర్షాలతో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనాలని, వర్షాల వల్ల తాగునీరు, విద్యుత్ లాంటి సమస్యలు రాకుండా ముందే చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. టెలీకాన్ఫరెన్స్లో రెవిన్యూ, గృహ నిర్మాణ, నీటిపారుదల, మున్సిపల్, మండల అభివృద్ధి అధికారులు,పాల్గొన్నారు.