13-12-2024 01:36:05 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 12 (విజయక్రాంతి): నగరంలో గంజాయి గుప్పుమంటోంది. పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ సరఫరాదారులను కటకటాల్లోకి నెడుతున్నా నిందితుల్లో ఎటువంటి మార్పు రావడం లేదురావడం లేదు. తాజాగా బోడుప్పల్ గౌతంనగర్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
బీహర్ రాష్ట్రానికి చెందిన వీరేంద్ర పండరీ.. హైదరాబాద్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు గురువారం ఎక్సైజ్ ఎస్టీఎఫ్ సీఐ సుభాష్చందర్ ఆధ్వర్యంలో దాడులు జరిపి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి 4.9 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఒక్కో చాక్లెట్ను రూ.15 చొప్పున స్కూళ్ల వ్దద చిన్నారులకు అమ్ముతున్నట్లు సమాచారం.
గంజాయి పట్టివేత
మలక్పేట్లోని అక్బర్బాగ్ ప్రాంతంలో స్కూటీపై గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఎస్టీఎఫ్ టీమ్ సభ్యులు అరెస్టు చేశారు. నిందితులు మహమ్మద్ జుబేర్, సయ్యద్ జహంగీర్ నుంచి 3.7 కిలోల గంజాయి, ఒక బైక్, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితలును మలక్పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ అంజిరెడ్డి తెలిపారు.