04-05-2025 12:00:00 AM
భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక సంక్షేమం, ఆర్థిక న్యాయం సిద్ధించేలా బహుళ ప్రయోజన పథకాలలో అడ్డా కూలీలను భాగస్వాములను చెయ్యాలి. ఆర్థిక భద్రత భరోసాతో అందించాలి. ‘శ్రమయేవ జయతే’ అన్నది వట్టి నినాదంగా కాకుండా శ్రామిక సంక్షేమానికి సమగ్రమైన విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలి. వీళ్లపట్ల జరుగుతున్న శ్రమ దోపిడీ విధానాన్ని అరికట్టాలి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో జీవన పోరాటంలో రోజువారి కూలీ చేసుకుని బతుకుతున్న కార్మికుల స్థితిగతులను మెరుగు పరచడానికి సమగ్ర చర్యలు చేపట్టాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 33 జిల్లా కేంద్రాలలో ఉన్న అడ్డాకూలీల సంఖ్య, వారి వివరాలు, విద్యార్హతలు, గృహ వసతి వంటి కనీస జీవన స్థితిగతులపై సమగ్ర సర్వే నిర్వహించాలి. వారిని కూడా కార్మికులుగా గుర్తిస్తూ, ‘లేబర్ కార్డులు’ ఇవ్వాలి.
అడ్డా కూలీలు తమ నివాస ప్రాంతాల నుంచి పనిచేసే ప్రాంతాలకు ఉపయోగిస్తున్న రవాణా విధానాలు, లభ్యతలపైనా సర్వే జరగాలి. వీరిలో ఎక్కువ శాతం భవన నిర్మాణ కార్మికులే ఉండడం గమనార్హం. తాపీ మేస్త్రీలు అన్ స్కిల్డ్, సెమీ స్కిల్ లేబర్స్ అధిక సంఖ్యలో రోజువారీ పనులతో తమ శ్రమను అల్ప వేతనాలకే అందిస్తున్నారు. వీరిలో ఎక్కువశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. ఇంకా చాలామంది నిరక్షరాస్యులు కూడా. కార్మిక చట్టాలపై వీరికి సరైన అవగాహన వుండదు.
ఒకే కాంట్రాక్టర్ కింద పనిచేసే కార్మికులు కొందరైతే వ్యక్తిగతంగా పనిచేసే వారు కొందరు అంటారు. కాంట్రాక్టర్ వద్ద పనిచేసే కూలీలకు నెలల తరబడి పని లభిస్తుంది. కార్మికులను సరఫరా చేసినందుకు ప్రతి కార్మికుని నెల వేతనం నుంచి 10 నుంచి 20 శాతం కమిషన్ కింద తీసుకుంటారు. వ్యక్తిగతంగా పనిచేసే కార్మికులకు పని లభించడం కష్టంగా ఉంటుంది. పని లభించక పోవడం వల్ల వారంతా కఠిన పేదరికాన్ని అనుభవిస్తుంటారు.
సంక్షేమం నుంచి సెలవుల వరకు!
‘ఆయుష్మాన్ భారత్’ కింద ఆరోగ్య కార్డు, ప్రమాద బీమా సౌకర్యం, హెల్త్ కార్డులు, లేబర్ కార్డులు వంటి సౌకర్యాలన్నీ ఈ దినసరి కూలీలకు కూడా మంజూరు చేయాలి. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు బస్సులు, రైళ్లలో ప్రయాణించడానికి టిక్కెట్ల రేట్లలో 50 శాతం ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. వీరిలో ఎక్కువగా భూమి లేని నిరుపేద కూలీలు ఉన్నారు. వారికి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి కనీసం 3 ఎకరాల పట్టా భూమి ఇవ్వాలి.
గ్రామాలలో ఉద్యాన వనాలు, నర్సరీల పెంపకం వంటివాటిలో వారికి ఉపాధి కల్పించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తే పట్టణాలకు వలస తగ్గుతుంది. సన్నకారు రైతులు కొద్దిభూమి కలిగినవారు వ్యవసాయ సీజన్లో వారి సొంత వ్యవసాయ పనులు చేసుకుని రోజువారీ కూలీలుగా పనిచేస్తుంటారు. అడ్డా కూలీల సగటు వయసు 15- సం॥రాలుగా ఉంటున్నది. ఒక భవనం నిర్మాణం పూర్తి అయ్యే వరకు 10 నుంచి 20 మంది ఒకే ప్రాంతంలో ఒకే భవనం వద్ద కాంట్రాక్టర్ నిర్మించిన గుడిసెలో లేదా ఇరుకు గది లేదా టెంట్లో 5 నుంచి 10 మంది వరకు నివాసం ఉండాల్సి వస్తుంది.
భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు ప్లంబింగ్, శానిటేషన్, డ్రైనేజీ నిర్మాణ పనులు చేస్తూ కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకున్న సమయం వరకు అక్కడే ఉంటారు. భవన నిర్మాణ కార్మికులలో తాపీ మేస్త్రీలు, కూలీలు. ఎలక్ట్రిషన్స్, పెయింటర్స్, సెంట్రింగ్ మేస్త్రీలు వంటి వారంతా ఈ వర్గంలో ఉంటారు. వీరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక మంత్రిత్వ శాఖ చట్టాలు వేతనాలు, పనిగంటలు, సెలవులను వర్తింపజేయాలి. వాటి గురించిన అవగాహన ఉండటం లేదు.
ప్రత్యేక బడ్జెట్ అవసరం
కార్మిక శాఖద్వారా అమలవుతున్న కార్మిక చట్టాలను వీరికి కూడా విధిగా తెలియజేయాలి. లేబర్ అడ్డాలలో మౌలిక వసతులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకోవాలి. ప్రతి జిల్లా, మండల, నగర పట్టణ ప్రాంతాలలోని లేబర్ అడ్డాలలో మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, షెడ్లు విశ్రాంతి గదులు నిర్మించాలి.
60 సం॥రాలు పై బడిన వారికి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి. వారికి ప్రభుత్వం ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలి. అడ్డా కూలీల పిల్లల చదువుకు స్కాలర్షిప్ సౌకర్యం కల్పించడం ద్వారా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత హోస్టల్ విద్యావసతి కల్పించాలి. లేబర్ అడ్డాలలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, మహరాష్ట్ర, పంజాబ్ ప్రభుత్వాలు అడ్డా కూలీలకు మోటారు సైకిళ్లు పంపిణీ చేస్తున్నాయి.
ఈ పద్ధతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలి. అడ్డా కూలీల ఆర్థిక స్థాయి వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచడానికి అవసరమైన అన్ని చర్యలూ ప్రభుత్వం చేపట్టాలి. మరీ ముఖ్యంగా మేడే రోజు మాత్రమే వీళ్లు సెలవు దినంగా కార్మికుల దినంగా జరుపుకుంటారు. కనీస వేతనాల చట్టాన్ని విధిగా వర్తింప చేయాలి. కార్మిక సంక్షేమ చట్టాలు, పథకాలను వీరికి వర్తింపచేయాలి. ప్రతి నెల నాలుగు రోజులు సెలవు దినాలను వీరికీ వర్తింపచేయాలి.
శ్రమకు తగిన ఫలితాలు
కార్మిక చట్టాలపట్ల అవగాహన కోసం చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రభుత్వాలు కార్మికులకు నిర్ణయించిన చట్టాలు, జీవోలు వీరికి తెలియపరచాలి. వాటిపై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. ప్రతి కూలీకి ఐడీ కార్డు ఇవ్వాలి. లేబర్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండేలా ప్రభుత్వం కృషి చేయాలి.
ఇన్సూరెన్స్ కంపెనీలు అడ్డా కూలీలకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను వర్తింప చెయ్యాలి. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ తమ పాలిసీలలో 5 శాతం అడ్డ కూలీలకు రాయితీ అవకాశం కల్పించేట్లు విధి విధానాలు రూపొందించి అమలు చేయాలి. ఉచిత విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యం’ ఉచిత గృహ వసతి’ పోషకాహార సౌకర్యం కలిపించాలి. ఈ రకంగా వారి జీవితాలలో వెలుగులు నింపాలి.
భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక సంక్షేమం, ఆర్థిక న్యాయం సిద్ధించేలా బహుళ ప్రయోజన పథకాలలో అడ్డా కూలీలను భాగస్వాములను చెయ్యాలి. ఆ ర్థిక భద్రత బరోసాతో అందించాలి. ‘శ్రమయేవ జయతే’ అన్నది వట్టి నినాదంగా కా కుండా శ్రామిక సంక్షేమానికి సమగ్రమైన విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలి. వీళ్లపట్ల జరుగుతున్న శ్రమ దోపిడీ విధానాన్ని అరికట్టాలి.
అడ్డా కూలీల జీవితాల లో స్వేచ్ఛ, ఆత్మగౌరవాన్ని పెంపొం దించ టానికి కార్మిక మంత్రిత్వశాఖ సమగ్ర కా ర్యాచరణ, ప్రణాళికలను అమలు చెయ్యా లి. వీరి శ్రామిక సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని పెంచటానికి ప్రభుత్వం స్థూల స్థాయిలో శిక్షణా కేంద్రాలను నెలకొల్పాలి. శీఘ్రతర ఆర్థికాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక వ్యూహాలను అమలు చేయడం ద్వారా దినసరి కూలీల జీవితాలలో మార్పులకు ప్రభుత్వం కంకణం కట్టుకోవాలి.
వ్యాసకర్త సెల్: 9440245771