యువత ఆరోగ్యం ముప్పులోనేనా?
జీవనశైలి వ్యాధులపై కేర్ వైద్యుల హెచ్చరిక
ముందస్తు వైద్య పరీక్షలపైనే దృష్టి
నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
హైదరాబాద్, ఏప్రిల్ ౬(విజయక్రాంతి): మనకు ఏ సమస్యలూ లేవు.. ఆరోగ్యం బాగానే ఉంది అనిపించడం సహజం. కానీ నేటి పరిస్థితుల్లో అదే భావన చాలా మందిని ప్రమాదంలోకి నెడుతోంది. డయాబెటిస్, హై బీపీ, ఫ్యాటీ లివర్ వంటి జీవనశైలి వ్యాధులు ఇప్పుడు ‘సైలెంట్గా’ పెరుగుతున్నాయి.ముఖ్యంగా 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయసువారిలో ఇవి వేగంగా పెరుగుతున్నాయని కేర్ హాస్పిటల్స్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
యువతలోనే ఎక్కువగా కనిపించడం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణంగా ఇతర కారణాల కోసం డాక్టర్ను కలిసినప్పుడు లేదా ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనే ఈ సమస్యలు బయటపడుతున్నాయి. అప్పటికే వ్యాధి ముదిరి ఉండటంతో చికిత్స క్లిష్టమవుతోంది.దేశవ్యాప్తంగా చూస్తే ప్రతి నలుగురిలో ఒకరికి హైబీపీ ఉండే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. కానీ వీరిలో చాలా మందికి తమకు బీపీ ఉందనే విషయం కూడా తెలియదు. డయాబెటిస్ విషయంలో కూడా భారత్ ముందున్న దేశాల్లో ఒకటి. ముఖ్యంగా పట్టణాల్లో యువతలోనే ఈ వ్యాధులు త్వరగా ప్రారంభమవుతున్నాయి.
కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ లో జనరల్ మెడిసిన్ విభా గం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ హెచ్ గురు ప్రసాద్ మాట్లాడుతూ, ఇప్పుడు మనం చూసేది కేవలం కేసుల పెరుగుదల కాదు..అవి కనిపిస్తున్న వయసు. 30 40 ఏళ్లలోనే డయాబెటిస్, బీపీ, ఫ్యాటీ లివర్ కనిపిస్తున్నాయి.చాలా మంది చెకప్లను వాయిదా వే స్తారు. లక్షణాలు కనిపించే సమయానికి వ్యాధి ఇప్పటికే ముందుకు వెళ్లిపోయి ఉంటుంది, అని చెప్పారు.నగర జీవనశైలి ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా మారింది. ఎక్కువ పని గంటలు, ఒత్తిడి, అసమయ భోజనం, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు, వ్యా యామం లేకపోవడం,నిద్రలోపం, పెరుగుతున్న వేడి ప్రభావం, ఇవి అన్నీ కలిసి ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తున్నాయి.
అయితే జీవనశైలి మారినా ఆరోగ్యంపై ముందస్తు జాగ్రత్తలు మాత్రం చాలా మందిలో కనిపించడం లేదు.‘మనకు బాగానే ఉంది అనిపించడం వల్ల పరీక్షలు అవసరం లేదనుకోవడం పెద్ద పొరపాటు. బయటికి ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా లోపల సమస్యలు ఉండొచ్చు.ప్రతి సంవత్సరం ఒకసారి సాధారణ పరీక్షలు చేయించుకుంటే చాలా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిం చి నియంత్రించవచ్చు. ప్రీవెంటివ్ హెల్త్ ఇప్పుడు తప్పనిసరి’, అని డాక్టర్ గురు ప్రసాద్ సూచించారు.
ఏ పరీక్షలు చేయించుకోవాలి?
30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ఇందులో రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటు పరీక్ష, కొలెస్ట్రాల్ను అంచనా వేయడానికి లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్టులు, అలాగే శరీర బరువు, బాడీ మాస్ ఇండెక్స్ వంటి అంశాల పరిశీలన ఉండాలి. ఇవి ముందుగానే సమస్యలను గుర్తించి, ఆరోగ్యాన్ని నియంత్రించడానికి ఎంతో ఉపయోగపడతాయి.
కేర్ హాస్పిటల్స్ ముందస్తు ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టి స్క్రీనింగ్ ప్రోగ్రామ్లు, అవగాహన కార్యక్రమాలు, కార్పొరేట్ హెల్త్ చెకప్ల ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది.వైద్యుల అభిప్రాయం ప్రకారం రాబోయే కాలంలో ఆరోగ్యంపై పోరాటం ఆసుపత్రుల్లో కాదు, ముందస్తు జాగ్రత్తలతోనే మొదలవుతుంది. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందే గుర్తించి నివారించడం మేలని వారు చెబుతున్నారు.




