calender_icon.png 10 February, 2026 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కీసరగుట్టలో వీఐపీ దర్శనాలతో భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి

10-02-2026 12:07:16 AM

కలెక్టర్ మను చౌదరి

మేడ్చల్, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి): కీసర శ్రీ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవా లలో విఐపి దర్శనాలతో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. కీసర శ్రీ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 13 వ తేదీ నుంచి  18వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో సోమవారం కీసర గుట్టకు వెళ్ళిన కలెక్టర్ మన చౌదరి,  మల్కాజ్గిరి డిసిపి శ్రీధర్ , ట్రాఫిక్ డిసిపి రాహుల్ రెడ్డి ఐపీఎస్, ఆర్డిఓ రాజేష్,   

ఆలయ కమిటీ చైర్మన్ తటాకం వెంకటేశ్,  ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి లతో కలిసి  ఏర్పాట్లను పరిశీలించారు.  ఈ సందర్బంగా  ఆలయ పండితులు పూర్ణ కుంభంతో కలెక్టర్ కు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గల సమావేశ మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ  బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు   క్యూలైన్ లను పెంచాలన్నారు.

వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఆర్టీసీ బస్సులు పెంచాలన్నారు. భద్రతా లోపం తలెత్తకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు. భక్తులకు అత్యవసర చికిత్సకై అవసరమైన వైద్య సిబ్బంది, మందులు  అందుబాటులో ఉండాలన్నారు. బ్యారీకేడ్,  దర్శనం క్యూ లైన్, పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ప్రస్తుతం ఎండలు పెరుగుతున్నాయని అందుకు జాతరలో  భక్తులకు అందుబాటులో అవసరమైన అన్ని చోట్ల  త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని వాటర్ వరక్స్ వారికీ తెలిపారు.

జాతరలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దర్శనార్థం వచ్చే వృద్ధులు దివ్యాంగులకు ప్రత్యేక వాహన సదుపాయం కల్పించాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులకు సూచించారు. జాతరలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలని అందుకు  సంబంధించి ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలని ఈ విషయంలో  అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. కీసర గుట్ట బ్రహ్మోత్సవాల జాతరలో పూజ సామాగ్రి ,

ఆహార పదార్థాల నుంచి మొదలుకొని అన్ని రకాల వస్తువుల విక్రయానికి సంబంధించి ధరలు భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలని, ఎక్కువ ధరలకు విక్రయించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులు వ్యాపారులకు తెలపాలన్నారు. జాతర రోజుల్లో ఆలయ పరిసరాల్లో అగ్నిమాపక సిబ్బందితో పాటు ఫైరింజన్ను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ తెలిపారు.   

ఈ సందర్భంగా కీసర ఆలయంకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు, సమస్యలు  ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని ఆలయ ఈవో,  ఛైర్మన్ కు  తెలిపారు.  మహాశివరాత్రికి కీసరగుట్టలో రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి విజయవంతం చేయాలని కలెక్టర్  సమావేశంలో స్పష్టం చేశారు.ఈ సమీక్ష సమావేశంలో  జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.