calender_icon.png 21 July, 2025 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేడుకగా మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

20-05-2025 12:00:00 AM

పాల్గొన్న స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

హనుమకొండ, మే 19 (విజయ క్రాంతి): స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాల గ్రామంలో నూతనంగా నిర్మించిన మహంకాళి అమ్మవారి, పోచమ్మ తల్లి విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ఎంపీ, ఎమ్మెల్యే లకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మహంకాళి అమ్మవారి విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన పూర్ణాహుతి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపైన ఉండాలని, ప్రజలందరూ సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నారు.

ఇంత గొప్పగా ఆలయాన్ని నిర్మించడానికి సహకరించిన సోమిరెడ్డికి, ఆలయ నిర్మాణానికి ఎంపీ నిధుల నుండి నిధులు కేటాయించిన ఎంపీ డాక్టర్ కడియం కావ్యకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజులలో మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

సముద్రాల గ్రామ పరిధిలోని నారాయణపల్లెలో 33/11కేవి సబ్ స్టేషన్ నిర్మాణం చేసుకోబోతున్నామని, దింతో సముద్రాల గ్రామానికి ఎలాంటి విద్యుత్ సమస్యలు, విద్యుత్ అంతరాయం ఉండబోదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.