ఎల్పీజీ ధరల పెంపు.. సమర్థించుకున్న కేంద్రం
న్యూఢిల్లీ: దేశీయ ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరలను రూ.29 మేర పెంచిన కొద్ది గంటలకే, కేంద్ర ప్రభుత్వం ఆ పెంపును సమర్థించుకుంటూ వివరణ ఇచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ, భారతీయ గృహాలను ఆ ప్రభావం పూర్తిగా పడకుండా రక్షించే చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. 14.2 కిలోల ఎల్పీజీ (LPG) సిలిండర్ సరఫరా వ్యయం ఇప్పుడు రూ.1,600 దాటిందని ప్రభుత్వం తెలిపింది.
అదే సమయంలో తాజా సవరణ తర్వాత ఢిల్లీలోని సాధారణ వినియోగదారు రూ.942 చెల్లించాల్సి ఉండగా, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారు అర్హత కలిగిన రీఫిల్స్పై వాస్తవానికి రూ.642 చెల్లిస్తారని కేంద్రం పేర్కొంది. అలాగే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో చెల్లించే ధర కంటే చాలా తక్కువ ధరకు భారతీయ గృహాలు వంట గ్యాస్ను కొనుగోలు చేయడం కొనసాగిస్తున్నాయి. తాజా పెంపుతో ఢిల్లీలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.913 నుంచి రూ.942కి చేరింది. మార్చి 7న పెంచిన రూ.60తో గత మూడు నెలల్లో మొత్తం పెంపు రూ.89కి చేరింది.






