7 June, 2026 | 1:40 PM

మాట నిలబెట్టుకున్న మట్టా

07-06-2026 12:13 PM

చండ్రుపట్లలో 46 మంది మత్స్యకారులకు గుర్తింపు కార్డుల పంపిణీ

కల్లూరు,(విజయక్రాంతి): మండల పరిధిలోని చండ్రుపట్ల గ్రామంలో శనివారం మత్స్య పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో నూతన సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా 46 మంది మత్స్యకారులకు గుర్తింపు కార్డులు అందజేశారు.గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మత్స్యకారులకు గుర్తింపు కార్డులు అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,గ్రామ ప్రజలు గత ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిపించడంతో చండ్రుపట్లను మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.ఇప్పటికే గ్రామంలో 32 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం, రూ.30 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం, 200కు పైగా కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ఇంకా పలు అభివృద్ధి ప్రతిపాదనలు ఉన్నాయని,ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

నూతనంగా గుర్తింపు కార్డులు పొందిన మత్స్యకారులకు అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే, ఈ కార్డుల ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైరా ఎఫ్డిఓ బానోతు వీరన్న, ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి,కల్లూరు మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్,మండల అధ్యక్షులు పోట్రు అర్జున్ రావు,ఏఎంసీ డైరెక్టర్ లింగనబోయిన పుల్లారావు,మాజీ ఎంపీటీసీ కుక్కా నాగమ్మ, వార్డు సభ్యులు దుగ్గిరాల సీతారాములు, పంచాయతీ సెక్రెటరీ లక్ష్మణ్ వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.