07-06-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, జూన్ 6: అపర కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ కంపెనీ స్టార్లింక్కు భారత టెలికం మంత్రిత్వ శాఖ నుంచి శుక్రవారం ఆమోదం లభించినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో స్టార్లింక్కు ఉన్న పెద్ద అడ్డంకి తొలగినట్లయింది. త్వరలోనే ఈ కంపెనీ భారత్లో వాణిజ్య కార్యకలాపాలు మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.
2022 నుంచి భారత ప్రభుత్వం జారీ చేసే అనుమతుల కోసం స్టార్ లింక్ ఎదురుచూస్తోంది. కానీ జాతీయ భద్రతా కారణాల వల్ల ఈ అనుమతులు ఆలస్యం అవుతూ వచ్చాయి. అమెజాన్కు చెందిన కైపర్ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. స్టార్ లింక్ ప్రతినిధులు కానీ టెలికమ్యూనికేషన్స్ శాఖ (డీవోటీ) ప్రతినిధులు కానీ ఈ ఆంశంపై ఇప్పటి వరకూ స్పందించలేదు.
మూడో కంపెనీగా స్టార్ లింక్
భారత్లో శాటిలైట్ ఆధారిత వెబ్ సర్వీసెస్ అందించే మూడో సంస్థగా స్టార్ లింక్ నిలిచింది. ఇప్పటికే ఈ విభాగంలో యులెల్సాట్ వన్ వెబ్, రిలయన్స్ జియోలు లైసె న్సులు పొందాయి. మార్చిలోనే ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు భారతి ఎయిర్టెల్, జియోలు ప్రకటించాయి. స్పేస్ ఎక్స్ సా యంతో మరింత వేగంగా ఇంటర్నెట్ సేవలు అందుతాయని ఈ కంపెనీలు పేర్కొన్నాయి.
ఈ రెండు కంపెనీలు కూడా స్టార్ లింక్ సర్వీసులను భారత్లో ప్రవేశపెట్టేందు కే స్పేస్ ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్న కొద్ది రోజుల్లోనే మస్క్ కం పెనీకి అనుమతులు రావడం గమనార్హం. స్టార్ లింక్ ఇప్పటికే అనేక దేశాల్లో ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తోంది.
లో ఎర్త్ ఆర్బిట్లో ఉన్న ఉపగ్రహాల ద్వారా స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలందిస్తోంది. ఈ లో ఎర్త్ ఆర్బిట్ (లియో)లో సంస్థకు చెందిన ఆరు వేల పైచిలుకు ఉపగ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. ఇప్పటికే 100కు పైచిలుకు దేశాల్లో స్టార్ లింక్ సేవలు అందుబాటులో ఉన్నాయి.