calender_icon.png 18 June, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంతానోత్పత్తికి సవాళ్లు

13-06-2025 12:00:00 AM

ఎక్కువ మంది పిల్లలు వద్దనుకుంటున్నారా అంటే అవుననే సమాధానమిస్తున్నాయి భారతీయ కుటుంబాలు. గత తరాలవలె ఎక్కువ మంది పిల్లలతో సంసారం ఈదలేమనే భావన స్థిరపడి పోయింది. దీనికి కారణాలనేకం. ఇటీవల ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నివేదిక, పలు దేశాల్లో సంతానోత్పత్తి తగ్గిపోవడాన్ని, అందుకుగల కారణా లను తెలిపింది. మీరు ఎక్కువ మంది పిల్లల్ని ఎందుకు వద్దనుకుంటున్నారంటే, మన దేశంలోని దంపతులు చెబుతున్న ప్రధాన కారణం ఆర్థిక ఇబ్బందులని. సర్వేలో 38 శాతం మంది కుటుంబీకులు, ఎక్కువ మంది పిల్లలతో ఆర్థికంగా నెట్టుకు రాలేమని చెప్పారు.

మంచి విద్య, వైద్యం.. అన్ని రకాల వసతులు కల్పించి ఒక అబ్బాయినో, అమ్మాయినో 18 ఏళ్ల వరకు పెంచాలంటే మన దేశంలో తల్లిదండ్రులకు అవుతున్న ఖర్చు 30 లక్షల రూపాయల నుంచి కోటి 20 లక్షల వరకు ఉంటుందని అంచనా. సంతానోత్పత్తి తగ్గిపోవడానికి కారణం పట్టణ ప్రాంతాల్లో మహిళలు సొంత ఆలోచనా విధానాన్ని కలిగి ఉండటం కూడా ఒక అంశమే.

భర్త చెబుతున్నాడనో, అత్తమామలు చెబుతున్నారనో గంపెడు మంది పిల్లల్ని కనేందు కు వారు సిద్ధంగా లేరు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ రంగాలపై ప్రభుత్వాల శీతకన్ను ప్రభావం సంతానోత్పత్తిపై పడుతున్నది. భారత్‌లో ఒక మహిళ సంతానోత్పత్తిని సగటున తీసుకుంటే అది 1.9కి పడిపోయిందని ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ 2025 నివేదికలో పేర్కొన్నది.

సామాజిక, ఆర్థిక అస్థిరత కుటుంబ పరిమాణాన్ని కుంచించుకు పోయేలా చేస్తున్నదనేది ఇక్కడ వాస్తవం. సరళీకృత ఆర్థిక విధానాలవల్ల దేశం ఆర్థిక ప్రగతి సాధించినా, మంచి విద్య, గృహ సదుపాయం, ఆరోగ్య సర్వీసులు, పిల్లల పెంపకం సమస్యలుగానే మిగిలాయి. గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి రేటు ప్రతి ఏడాది కాస్త ఎక్కువే కనిపిస్తున్నా, పౌష్టికాహార లోపం, వ్యాధులు సంక్రమించడం సమస్యలుగా కొనసాగుతున్నాయి.

ప్రసవం సమయంలోనే తల్లులు ఎక్కువ సంఖ్యలో మరణించడం మన దేశంలో సర్వసాధారణంగా వుండేది. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గడం ఊరటనిచ్చే అంశమే. అయితే సంతానోత్పత్తి వయస్సులోనే మహిళల్లో ఎక్కువగా రక్తహీనత కనిపిస్తున్నది. 2000 సంవత్సరం నుంచి యువతుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతూ వస్తున్నది. సర్వికల్ క్యాన్సర్ కూడా ఇప్పుడు శాపంగా మారింది.

15 నుంచి 19 ఏళ్ల మధ్య యుక్తవయసులోనే పిల్లల్ని కనడం మన దేశంలో ఎక్కువవుతున్నది. ఈ వయస్సులో సంతానోత్పత్తి రేటును గమనిస్తే చైనాను భారత్ మించి పోవడం ఆందోళన కలిగిస్తున్నది. శ్రీలంక, థాయిల్యాండ్‌లలో కూడా ఈ వయస్సు వారిలో సం తానోత్పత్తి కూడదనే చైతన్యం మన దేశంలో కంటే ఎక్కువే ఉంది. పిల్లల్ని ఏ వయస్సులో కనాలి అనేది లక్షలాది మంది ఒక లక్ష్యంగా భావించడం లేదని ఐక్యరాజ్యసమితి నివేదిక చెబుతున్నది.

అసలు సంక్షోభం ఇదే. ఉద్యోగ భద్రత లేకపోవడం, నిరుద్యోగం సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఏదేమైనా, 2025 నాటికి భారత్ జనాభా 146 కోట్లకు చేరుకుంటుందని ఆ నివేదిక అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా వస్తు న్న వాతావరణ మార్పుకు తోడు అత్యధిక జనాభాతో ఎదురయ్యే సవాళ్లను అధిగమించ గలిగినప్పుడే ఆరోగ్య సదుపాయాలు, గృహ వసతి వంటి అవసరాలు తీరుతాయి.