calender_icon.png 19 June, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆహార కల్తీని అరికట్టండి!

13-06-2025 12:00:00 AM

ఆహార కల్తీ ప్రజల ప్రాణాలకు సంకటంగా మారింది. ఇటీవల హైదరాబాద్, ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక చికిత్సాలయంలో కలుషిత ఆహారం తిని ఒకరు మృతి చెందగా సుమారు 92 మంది అస్వస్థతకు గురవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు పరమాన్నం తిన్న కారణంగా రోగులు అనారోగ్యానికి గురైనారని అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రులకు సరఫరా చేసే ఆహార పదార్థాలు సైతం తక్కువ నాణ్యతతో ఉండటం బాధాకరం.

బిర్యానీ, తందూరి చికెన్ పదార్థాలలో కృత్రిమ రంగులు పరిమితికి మించి వాడుతున్నట్లు గతంలోనే తేలింది. పలు పదార్థాలలో నిషేధిత రసాయనాలను కూడా కలుపుతున్నారు. ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో ఉపయోగించే వెనిగర్‌లో ఆమ్లం ఉంటుంది. టమాటా సాస్ కూడా అధికంగా కల్తీ అవుతుంది. డబ్బాలో దొరికే అల్లం, వెల్లుల్లి మిశ్రమంలోనూ కల్తీ ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తున్నది.

కేవలం అల్లం వెల్లుల్లి బెంజోయి కాండం పసుపురంగు కలిపి తయారుచేసి వాటిని రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నారు. దీని వినియోగం శ్రుతిమించితే చర్మం, కంటి సమస్యలకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో తందూరి చికెన్, చికెన్ ఇతర వంటలు ఎర్రగా కనిపించేందుకు అలాంటి వాటిని కలుపుతున్నట్టు తెలుస్తున్నది. తద్వారా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎర్రగడ్డ లాంటి ఘటనలు మరోమారు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి.

 కామిడి సతీష్‌రెడ్డి, భూపాల్‌పల్లి జిల్లా