05-07-2025 12:00:00 AM
ఉద్యమ కళాకారుల వేదిక
అధ్యక్షులు మద్దెల నర్సింలు
సిద్దిపేట, జూలై 4 (విజయక్రాంతి): ఈనెల 13న మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో జరగబోయే పాటల పల్లకిలో 12 గంటలు కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమ కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు మద్దెల నర్సింలు పిలుపునిచ్చారు. సిద్దిపేటలో పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం కోసం నిస్వార్ధంగా తమ కళాలను, గలాలను విప్పి యావత్ తెలంగాణ ప్రజలను చైతన్య పరచి రాష్ట్ర సాధనలో కీలకపాత్ర వహించిన ఉద్యమ కళాకారులు రాష్ట్రము ఏర్పడ్డాక గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంస్కృతిక సారధిలో అర్హులైన ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు రాకపోవడం చాలా బాధాకరమన్నారు. ఈ ప్రభుత్వమైనా ఉద్యమ కళాకారులను గుర్తించి తక్షణమే ఉద్యోగాలు ప్రకటించాలనీ కోరారు.
పాటల పల్లకి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఉద్యమ కవి, గాయకులు నేర్నాల కిషోర్, చక్రాల రఘులు పాల్గొంటారని వెల్లడించారు. రాష్ట్ర కార్యదర్శి బండకాడి గణేష్, ఉద్యమ కళాకారులు కళా ప్రసాద్, తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పిన్నింటి దాసు, రాష్ట్ర కార్యదర్శి ఎర్రవల్లి శీనువాస్, గుండెల్లి రాకేష్, తదితరులు పాల్గొన్నారు.