16 August, 2026 | 12:07 AM

నా మనసంతా పోలవరం ప్రాజెక్టే : సీఎం చంద్రబాబు

17-06-2024 04:16 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సోమవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... 7 విలీన మండలాలు ఏపీకి వచ్చాయి కాబట్టే ప్రాజెక్ట్‌ కట్టగలిగామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ అనేక సంక్షోభాలను ఎదర్కొందని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్ట్‌తో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గోదావరి జిల్లాలకు నీరు వాడుకోవచ్చని తెలిపారు. చైనా త్రీగార్జెస్‌ ప్రాజెక్ట్‌ కంటే ఎక్కువ నీరు ఈ ప్రాజెక్ట్‌ స్పిల్‌ వే నుంచి విడుదల అవుతూందని చెప్పారు.

ఈ ప్రాజెక్టు నదిని మళ్లించి కడుతున్నామని తెలిపారు. 72 శాతం ప్రాజెక్ట్‌ను తమ హయాంలో పూర్తి చేశామని, రాజకీయాల్లో ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారని విమర్శించారు. తాను 30 సార్లు ప్రాజెక్ట్‌ చూసేందుకు వచ్చానని తెలిపారు. తన మనసంతా ఈ ప్రాజెక్ట్‌ పైనే ఉందన్న చంద్రబాబు తన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారని ఆదేవన వ్యక్తం చేశారు. నేడు ప్రాజెక్టును పరిశీలించి, జరుగుతున్న పనుల పురోగతిని బాబు సమీక్షించారు. ల్యాండింగ్‌కు ముందు స్పిల్‌వేతో సహా సైట్‌ను ఏరియల్ సర్వే చేశాడు. స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌, డయాఫ్రమ్‌ వాల్‌, ఇతర భాగాల నిర్మాణాలకు సంబంధించిన అప్‌డేట్‌లను జలవనరుల శాఖ అధికారులను సీఎం కోరారు.