23-06-2025 01:29:55 AM
- స్థానిక ఎన్నికల ముందు ఇవేం పంచాయితీలు
- అధికార కాంగ్రెస్లో భగ్గుమంటున్న అంతర్గత విభేదాలు
- అధిష్ఠానానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు
- ఆందోళన వ్యక్తం చేస్తున్న పార్టీ క్యాడర్
- రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు
- కాంగ్రెస్కు తలనొప్పిగా మారిన వరంగల్ పంచాయితీ
- ఇప్పటికే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లడం లేదంటూ క్యాడర్ ఆవేదన
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): ఒక వైపు స్థానిక సంస్థల ఎన్నికల సమయం ముంచుకొస్తోంది..మరోవైపు అధికార కాంగ్రె స్ పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. విమర్శలకు ప్రతి విమర్శలకు వేదికగా నిలుస్తున్నాయి. అధికారం చేపట్టి ఏడాదిన్నర దాటినా చాలా నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలను సమసిపోయేట్లు అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతోంది.
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథ కాలు, అభివృద్ధిని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు ఐక్యంగా ఉండి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిపోయి.. సొంత పార్టీ నాయకులే అంతర్గత విభేదాలతో రోడ్డున పడటంపై పార్టీ క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజాగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వ్యాఖ్య లు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ను కుదిపేస్తున్నాయి. అంతేకాకుండా రాష్ర్టం లోని పది ఉమ్మడి జిల్లాల్లోనూ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి. గోషామహల్, ఖైరతాబాద్, గజ్వేల్, గద్వాల, ఆలంపూర్, పటాన్చెరు, వనపర్తి, బాన్సువాడ, తుంగతుర్తి.. ఇలా దాదాపు 30 అసెంబ్లీ నియోజక వర్గాల్లో నాయకుల మధ్య నెలకొన్న విభేదా లు పార్టీ శ్రేణులను, కార్యకర్తలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
కాగా, సాధారణంగానే కాంగ్రెస్ పార్టీలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పుడు వర్గపోరు ఉండనే ఉంటుంది. ఇందుకు తోడు పది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఈ విభేదాలు ముదిరి పాకానపడ్డాయి.
ఇటీవల ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన దానం నాగేందర్, ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిన విజయారెడ్డి మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. గజ్వేల్ నియోజకవర్గంలో అక్కడ ఆ నియోజకవర్గ ఇన్చార్జ్ నర్సారెడ్డిని డీసీసీ పదవి నుంచి తొలిగించాలంటూ ఆయన వ్యతిరేక వర్గం శుక్రవారం పీసీసీకి ఫిర్యాదు చేసింది.
అదేవిధంగా గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, సరితా తిరుపతయ్య మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. అలంపూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి మధ్య భేదాభిప్రాయాలు ఇటీవల కొట్టొచ్చినట్లు బయట పడ్డాయి.
ఏకంగా పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్పైనే.. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గాంధీభవన్లో మల్లు రవిపై సంపత్కుమార్ అనుచర వర్గం ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా పరకాల నియోజకవర్గ నాయకుడు కొండా మురళి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి వరంగల్ జిల్లా కాం గ్రెస్ నాయకులను అతలాకుతలం చేశాయి. ఆ జిల్లా నాయకులు అంతా సమావేశమై కొం డా మురళి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
మరోవైపు మురళి వ్యాఖ్యలపై డీసీసీ అధ్యక్షుడిని, అబ్జర్వర్ల నుంచి నివేదికలు వచ్చిన తర్వా త స్పందిస్తానని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అని చెబుతూనే ఎమ్మెల్యేలుగా నీ, మంత్రులుగానీ, ఇతర నాయకులుకాని గీత దాటి మాట్లాడవద్దని పీసీసీ అధ్యక్షుడు సున్నితంగా హెచ్చరించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్న విభేదాలు అక్కడి భద్రకాళి అమ్మవారి బోనాలను తాత్కాలికంగా వాయిదా వేయాల్సిన పరిస్థితులకు దారితీశాయి. ఇప్పటికైనా రాష్ర్ట వ్యవ హారాల ఇన్చార్జ్ మీనాక్షినటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, సీఎం రేవంత్రెడ్డి జోక్యం చేసుకుని..నాయకుల మధ్య అం తరాన్ని తొలగించకుంటే ఆ ప్రభావం స్థానిక సంస్థలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మేం కావాలా..? కొండా దంపతులు కావాలా..?: ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షికి వరంగల్ నేతల ఫిర్యాదు
మంత్రి కొండా సురేఖ దంపతులపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షినటరాజన్కు వరంగల్కు చెందిన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్లోని ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షితో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, గండ్ర సత్యనారాయణ, రేవూరి ప్రకాశ్రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు భేటీ అయినట్లు తెలిసింది.
జిల్లాలో మంత్రి సురేఖ ఎవరిని కలుపుకొనిపోవడం లేదని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఒక వర్గాన్ని తయారుచేసి గ్రూపులను ప్రోత్సహిస్తున్నట్లు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇటీవల కొండా మురళి చేసిన వ్యాఖ్యలను పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో మౌనం వహించొద్దని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పార్టీకి తాము కావాలో.. కొండా ఫ్యామిలీ కావాలో అధిష్ఠానమే తేల్చుకోవాలని కూడా అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొండా మురళి వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని, విచారణకు సైతం జిల్లాకు సంబంధం లేని వారితో కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నామని, పారదర్శకంగా విచారణ చేయిస్తామని మీనాక్షినటరాజన్ హామీ ఇచ్చినట్లు సమాచారం.