06-06-2025 12:09:08 AM
ఆలేరు నియోజకవర్గం తిరుమలాపురంలో అభివృద్ధి పనులకు శ్రీకారం. బహిరంగ సభ
యాదాద్రి భువనగిరి జూన్ 5 ( విజయ్ క్రాంతి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి నేడు పర్యటించనున్నారు. తుర్కపల్లి మండలం తిరుమల గ్రామంలో అభివృద్ధి పనులకు శిలాఫలకాలను వేయనున్నారు.. నేడు మధ్యాహ్నం 2.20 గంటలకు ముఖ్యమంత్రి తన ఇంటి నుండి రోడ్డు మార్గాన బేగంపేట విమానాశ్రయానికి 2.40 నిమిషాలకు చేరుకుంటారు.
అక్కడి నుండి హెలికాప్టర్లో మూడు గంటల వరకు యాదాద్రి జిల్లా తిరుమలపురం గ్రామానికి చేరుకుంటారు. 1500 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టదలచిన అభివృద్ధి పనులకు 3.10 నిమిషాల నుండి 3.25 నిమిషాల వరకు శ్రీకారం చుడతారు. అనంతరం 3.25 నిమిషాల నుండి 4.40 వరకు జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.
అనంతరం 4:45 నిమిషాలకు తిరిగి హెలికాప్టర్లో 5.05 హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అభివృద్ధి పనులు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హనుమంతరావు తన అధికారులు పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా భారీ ఎత్తున స్వాగతం పలకడానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సభకు నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష మందిని తరలించడానికి ఏర్పాట్లు చేశారు.
ఏర్పాట్ల పరిశీలన..
నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిరుమలపురం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్పు స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఇతర పోలీసు అధికారులు పర్యవేక్షించారు. గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి సభకు వచ్చే ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. వాహనాలకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించామన్నారు. అక్కడే పార్కింగ్ చేయాలని కమిషనర్ సూచించారు.