calender_icon.png 7 June, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించాలి

07-06-2025 02:07:19 AM

- ఈ విద్యా సంవత్సరం నుంచి నవోదయ విద్యాలయం ప్రారంభం

- బడిబాట గ్రామ సభలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

మణుగూరు/కరకగూడెం, జూన్ 6 (విజయ క్రాంతి)  పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చేర్పించి వారికి బంగారు భవిష్యత్తును కల్పించడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం బడిబాట కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా కరకగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, అనవసరంగా డబ్బులు ఖర్చు చేసి విద్యను కొనుక్కోవలసిన అవసరం తల్లిదండ్రులకు లేదని సూచించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లను చేర్పించి వాటిని బలోపేతం చేయవలసిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తుందన్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన, ఉచిత వైద్య పరీక్షలు, అత్యున్నత విద్యార్హత కలిగిన ఉపాధ్యాయులతో విద్యాబోధన వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని కలెక్టర్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరం కరకగూడెంలోని జవహర్ నవోదయ విద్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు.

ప్రారంభోత్సవానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, వేరువేరు ప్రదేశాల నుండి ఈ విద్యాలయానికి విద్యార్థులు ప్రవేశం పొందుతారని, మన సొంత పిల్లల్లాగానే ఆదరించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని, నవోదయ విద్యాలయం ద్వారా దేశంలోనే అత్యంత నాణ్యమైన విద్యను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్థినీ విద్యార్థులకు అందుబాటులోకి రావడం మన జిల్లా అదృష్టమన్నారు.

బడి తెరిచేలోగా పనులు పూర్తి కావాలి 

 అనంతరం జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటు జరుగుతున్న పనులను పరిశీలించి, జూన్ 12 నాటికల్లా అన్ని రకాల పనులు పూర్తిచేసి పాఠశాల ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, కరకగూడెం తాసిల్దార్, జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ నాగరాజు శేఖర్, మండల విద్యాధికారి మంజుల, విద్యాశాఖ ఇంజనీరింగ్ డీఈ, ఏఈ, మండల సమాఖ్య సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.