07-06-2025 02:06:27 AM
సిద్దిపేట, జూన్ 6 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రజలను, ప్రభుత్వ ఉద్యోగులకు కేబినెట్ సమావేశం నిరాశపరిచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి కేబినెట్లో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత అని హామీ ఇచ్చారని, వంద రోజుల్లో ఏరియాస్ రిలీజ్ చేస్తామని, పీఆర్సి అమలు చేస్తామని, డీఏలు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
కేబినెట్ మీటింగ్లో అన్నింటిని ఉసూరుమనిపించారు తప్పా వాటి ప్రస్తావనే లేదన్నారు. ఒక డీఏ, పీఆర్సీ బకాయిలు చెల్లించేందుకు ముచ్చటగా మూడు కమిటీలు వేశారని, ఆ కమిటీలు చేసింది శూన్యం అని చెప్పారు. దేశంలో 5 డీఏలు పెండింగ్లో ఉంటే ఒకే రాష్ట్రంలో దానికోసం ఐదు గంటలకు పైగా కేబినెట్ చర్చ ఎందుకు అని ప్రశ్నించారు.
కేసీఆర్ సీఎంగా 73శాతం పీఆర్సీ ఇచ్చారని ఇది దేశంలోనే అత్యధికంగా ఉంటుందని గుర్తు చేశారు. అదే పీఆర్సీని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగులపై ఏసీబీ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, రాష్ట్రంలో అప్పులు లేని పంచాయతీ సెక్రెటరీ లేడని, అప్పులు తెచ్చి గ్రామపంచాయతీలను కొనసాగిస్తున్నారని విమర్శించారు.