25-10-2025 05:06:23 PM
చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు ఇంటరిమ్ ఇంజంక్షన్ను మంజూరు చేసిన కోర్ట్
హైదరాబాద్: సినీ అగ్ర నటీనటులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో తమ పేర్లు, ఫోటోలు, వాయిస్ దుర్వినియోగం చేస్తూ ఏఐ మార్ఫింగ్, వాయిస్ సింథసైజ్ తో తమ ప్రతిష్ఠ దెబ్బతింటోందని నటీనటులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును శనివారం ఆశ్రయించారు. చిరంజీవికి అనూకులంగా కోర్టు తీర్పు ఇచ్చింది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇవాళ I.A. No.6275 of 2025 in O.S. No.441 of 2025లో జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా ప్రముఖ నటుడు కొణిదెల చిరంజీవికి అనుకూలంగా అడ్-ఇంటరిమ్ ఇంజంక్షన్ (మధ్యంతర ఉత్తర్వులు) మంజూరు చేసింది.
ఈ ఉత్తర్వు ప్రకారం పిటిషన్లో పేరు పొందిన పలువురితోపాటు ఎవరైనా వ్యక్తి/ఏ సంస్థైనా, చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులను ఉల్లంఘించే విధంగా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్ తదితర గుర్తించదగిన లక్షణాలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం నిషేధించబడింది. నలభై ఏళ్లకు పైగా చలనచిత్ర రంగంలో విశిష్ట సేవలందించి పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి గౌరవాలందుకున్న చిరంజీవి, తన పేరు/చిత్రం/ప్రసిద్ధ సినీ శీర్షికలును అనుమతి లేకుండా వాడుకోవడం, ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ మొదలైన వేదికలపై వినియోగించడం, అలాగే కృత్రిమ మేధస్సు (AI) ద్వారా రూపాంతరం చేసిన (మార్ఫ్ చేసిన) చిత్రాలు, వీడియోలను ప్రచారం చేయడం ఆపేందుకు కోర్టు జోక్యం కోరారు.
భారతీయ చలనచిత్ర రంగంలో అగ్ర హీరోగా, ఉన్నత వ్యక్తిత్వంగా ఆయన స్థానాన్ని గుర్తిస్తూ, పేరుపెట్టి, చిత్రాలు తీసుకొని, వీడియో-మీమ్స్ చేసి, అనుమతి లేని విక్రయాలు మొదలైన చర్యల ద్వారా ప్రతివాదులు చేసిన ఉల్లంఘనలు ఆయన ఖ్యాతి, గౌరవానికి నష్టం కలిగిస్తున్నాయని ప్రస్తావించింది. ముఖ్యంగా డిజిటల్, AI వేదికల ద్వారా జరిగే వాణిజ్యపు దోపిడి, తప్పుడు ప్రతిరూపణ వల్ల అపరిమిత నష్టం సంభవించే ప్రమాదాన్ని కోర్టు గమనించింది. ఈ నిషేధాజ్ఞ ప్రకారం ప్రతివాదులు 1 నుంచి 33 వరకు మరియు ప్రతివాది 36 (జాన్ డో)—ఎవరు అయినా సరే—చిరంజీవి పేరు, స్టేజ్ టైటిల్స్ (ఉదా: “MEGA STAR”, “CHIRU”, “ANNAYYA”), స్వరము, చిత్రం లేదా ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన ఇతర వ్యక్తిత్వ లక్షణాలను ఏ రూపంలోనైనా, ఏ మాధ్యమంలోనైనా, వ్యక్తిగత లేదా వాణిజ్య లాభం కోసం నేరుగా గానీ పరోక్షంగా గానీ ఉపయోగించటం నుంచి వెంటనే నిరోధించబడుతున్నారు. అన్ని ప్రతివాదులకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించగా తదుపరి విచారణను 27 అక్టోబర్ 2025కు నిలిపివేసింది.
వ్యక్తిత్వ/ప్రచార హక్కుల ఉల్లంఘనలు గాని పరువు నష్టం చర్యలుగాని జరిగితే, సంబంధిత పౌర, ఫౌజ్దారీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. టెలివిజన్ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్ఫార్ములు, మీడియా సంస్థలు తదితర అన్నిరకాల వ్యక్తులు/సంస్థలు, TRPs పెంచడం, వీక్షణలను/లాభాలను పొందడం వంటి ఉదేశ్యాలతో, చిరంజీవి పేరు, చిత్రం, స్వరము, లైక్నెస్ లేదా ఇతర వ్యక్తిత్వ లక్షణాలను అనుమతి లేకుండా ఉపయోగించడం, తప్పుగా ప్రతిబింబించడం లేదా వక్రీకరించడం చేస్తే, చట్టం అనుమతించే కఠినమైన పరిహారాలు అమలు చేయబడతాయని ఈ ఉత్తర్వు స్పష్టంగా హెచ్చరిస్తుంది. తద్వారా ఆయన ఖ్యాతి, మేధసంపత్తి రక్షణను పటిష్టంగా అమలు చేస్తుంది.
అక్టోబర్ 11న చిరంజీవి హైదరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్ని కలసి కోర్టు ఉత్తర్వుల ప్రతిని వ్యక్తిగతంగా అందజేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదు ప్రక్రియ (criminal law machinery)ను ఈ సందర్భాల్లో సమర్థంగా అమలులోకి తేవడం విషయంపై వారి నిపుణ సలహాను కోరారు. ఇటువంటి ఉల్లంఘనలను అరికట్టేందుకు శిక్షా చట్టాలు మరింత కఠినంగా ఉండాల్సిన అవసరంపై ఇరువురు సవివరంగా చర్చించారు. చిరంజీవి ఈ చట్టపరమైన చర్య, భారత వినోద రంగంలో వ్యక్తిత్వ, ప్రచార హక్కుల ప్రాముఖ్యతను బలపరుస్తుందని సజ్జనార్ నొక్కిచెప్పారు. ఈ విజయాన్ని సాధించడంలో అమూల్యమైన కృషి చేసిన ఎస్. నాగేశ్ రెడ్డి, అడ్వకేట్కి, వారి న్యాయ బృందానికి చిరంజీవి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వారి పట్టుదల, వృత్తి నైపుణ్యం, సూక్ష్మ పరిశీలన ఈ మైలురాయి రక్షణ ఉత్తర్వు సాధనకు కీలకమయ్యాయి.