calender_icon.png 30 May, 2025 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడ కాంగ్రెస్‌లో వర్గపోరు

29-05-2025 01:27:51 AM

- నియోజకవర్గస్థాయి సమావేశం అడ్డగింత

- స్థానిక ఇన్‌చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డికి సమాచారం ఇవ్వరా!

- రవీందర్‌రెడ్డి అనుచరుల నిలదీత, ఆందోళన

కామారెడ్డి, మే 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌లో వర్గపోరు కొనసాగుతున్నది. బుధవారం నిర్వహించిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో వర్గపోరు మరోసారి బయటపడింది.

సమావేశానికి సంబం ధించి నియోజకవర్గ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డికి, తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ రవీందర్‌రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త నెలకొంది. సమావేశానికి హాజరైన ముఖ్య నేతలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటలపాటు ఆందోళన వాతావరణం నెలకొంది.

అధిష్ఠానం ఆదేశాల మేరకు బుధవారం బాన్సువాడలో నియోజకవర్గస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సమా వేశానికి కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు,  నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, ఆగ్రో కార్పొ రేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, నియోజకవర్గ స్థాయి సమావేశ ఇన్‌చార్జి వేణుగోపాల్ యాదవ్, ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు.

అయితే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డికి సమాచారం ఇవ్వకుండానే సమావేశం నిర్వహించడంతో ఆయన వర్గీయులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో రవీందర్‌రెడ్డి అనుచరులు వెళ్లి సమావేశాన్ని అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న తమకు సమాచారం ఇవ్వకుండా సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారంటూ నిరసన వ్యక్తం చేశారు.

దీంతో ఉద్రిక్తత పరిస్థి తులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బాహాబాహికి దిగారు. పోలీసులు చేరుకొని ఇరువర్గాలతో మాట్లాడి ఉద్రిక్తత వాతావరణాన్ని తగ్గించారు. ఆ తర్వాత సమావేశాన్ని నిర్వహించి మమ అనిపించారు.