calender_icon.png 30 May, 2025 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరికి 69 పెంపు

29-05-2025 01:30:57 AM

-14 వానాకాలం పంటల మద్దతు ధర పెంపునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

- పత్తిపై 589, మొక్కజొన్నపై 175 పెంపు 

- ఆయా పంటల కోసం 2.70 లక్షల కోట్లు కేటాయింపు

న్యూఢిల్లీ, మే 28: ఆరుగాలం శ్రమించి పంటలను పండిస్తున్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వానాకాలం పంటలకు (ఖరీఫ్ సీజన్) సంబంధించిన 14 పంటలపై కనీస మద్దతు ధరలను పెంచు తూ కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో దేశంలో ప్రధాన పంట అయిన క్వింటాల్ వరిపై రూ. 69 పెంచుతూ కేంద్రం నిర్ణ యం తీసుకోవడంతో క్వింటాల్ వరి మద్దతు ధర రూ. 2300 నుంచి రూ. 2369కి చేరింది. క్వింటాల్ పత్తిపై రూ. 589 పెంపుతో కొత్త ధర మధ్యస్థ రకం రూ. 7710గా, పొడవైన రకం రూ. 8110కి చేరింది.

బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర క్యాబినెట్ 2025 మార్కెటింగ్ సీజన్ కోసం ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను ఆమోదించింది. క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు.

అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. వానాకాలంలో సాగుచేసే 14పంటలపై కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను పెంచినట్టు వెల్లడించారు. ఇందులో ఆహార, వాణిజ్య, పప్పుధాన్యాలు, నూనె గింజలు సహా ఇతర పంటలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించిన ఈ పంటల మద్దతు ధర పెంపు 2025 మార్కెటింగ్ సీజన్‌కు వర్తిస్తుందని స్పష్టం చేశారు. 

మొక్కజొన్నపై రూ. 175 పెంచిన కేంద్రం.. జొన్నలపై రూ. 328 పెంచింది. పప్పు ధాన్యాల విషయానికి వస్తే కందులపై రూ. 450, పెసర్లు రూ. 86, మినుములపై రూ. 400 పెంచారు. నూనె గింజల విషయానికి వస్తే వేరుశనగపై రూ. 480, పొద్దు తిరుగుడుపూ రూ. 441, సోయాబీన్‌కు రూ. 436, ఈసారి నైజర్ సీడ్స్ (గడ్డి నువ్వులు)కు రూ. 820తో అత్యధిక మద్దతు ధరను ప్రకటించింది. 

వానాకాలంలో  ఆయా పంటలకు ఎంఎస్పీ కోసం రూ. 2.7 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ. 15, 642 కోట్లతో పాటు అన్నదాతల పెట్టుబడిపై 50 శాతం మార్జిన్ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

మద్దతు ధర పెంపుతో రైతులకు లబ్ధి : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  

14 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నదని, ఈ నిర్ణయంతో యావత్ దేశంలోని రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. తెలం గాణ రైతులు వరి, పత్తి, జొన్న, వేరుశనగ, కంది పండిస్తారని, వారందరికీ లబ్ధి చేకూరబోతున్నదని అన్నారు.

వరికి కనీస మద్దతు ధర రూ.2,300 నుంచి రూ.2,369 కి పెరిగిందని పేర్కొన్నారు. 2013 కనీస మద్దతు ధరతో పోల్చుకుంటే ఇది 81శాతం ఎక్కువని వెల్లడించారు. మద్దతు ధరలు తెలిపిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపు తున్నానని తెలిపారు.