22 April, 2026 | 11:09 PM

ప్రజలను అవమానించేలా సీఎం ప్రకటనలు

12-05-2024 01:12 AM

ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చిన హామీల్లో డొల్లతనాన్ని ప్రస్తావిస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. పదేళ్లలో రాష్ట్రానికి రూ.9లక్షల కోట్ల సహకారం అందించినా మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదనడాన్ని తప్పుబట్టారు. రేవంత్ ఇచ్చిన హామీలు, ప్రకటనలు కాంగ్రెస్‌ను మరింత దిగజార్చేలా, ప్రజలను అవమానించే విధంగా ఉన్నాయన్నారు.

73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీలకు కేంద్రం నిధులు మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. అయితే, కేంద్రం 2022 నుంచి పంచాయితీరాజ్ సంస్థల అకౌంట్‌లోకి నేరుగా నిధులను జమ చేస్తుందన్నారు. పీఎం సూర్య ఘర్ పేరు మార్చి కొత్త వాగ్దానంగా మ్యానిఫెస్టోలో పెట్టారన్నారు. కాజీపేటలో ఇప్పటికే రైల్ మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను తీసుకొచ్చిందని, మళ్లీ ఏర్పాటు చేస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. మోదీ ప్రాజెక్టులను కాంగ్రెస్ ఎందుకు క్రెడిట్ తీసుకోవాలనుకుంటోందో చెప్పాలని డిమాండ్ చేశారు.